ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసు సంచలన మలుపులు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉండటంతో, ప్రముఖ రాజకీయ నాయకులను కూడా అధికారులు అరెస్టు చేశారు. త్వరలోనే మరికొందరి అరెస్ట్ కూడా ఉంటుందనే ప్రచారం నేపథ్యంలో.. ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఈ కేసులో కీలకంగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పలుమార్లు బెయిల్ కోసం ప్రయత్నాలు చేసినా సరే లాభం లేకుండా పోయింది. ఇక మద్యం కుంభకోణంలో ఆయనది కీలక పాత్ర అని దర్యాప్తు బృందం తేల్చిన తర్వాత ప్రభుత్వం కూడా మరింత సీరియస్ గా అడుగులు వేస్తోంది.
Also Read : పరకామణి కేసులో అన్ని వేళ్లు ఆయన వైపే..!
తాజాగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. మద్యం కుంభకోణంలో అక్రమంగా సంపాదించిన ఆస్తులను, జప్తు చేయాలని ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రభుత్వానికి సిఫారసు చేసిన నేపథ్యంలో.. ప్రభుత్వం ఆస్తులను జప్తు చేసేందుకు ఆదేశాలు ఇచ్చింది. చెవిరెడ్డి కుటుంబం దాదాపు 55 కోట్ల రూపాయలను నల్లధనం మార్చినట్లు అధికారులు గుర్తించారు. తిరుపతి తో పాటుగా, నెల్లూరు, చిత్తూరు జిల్లాలో పలు ఆస్తుల జప్తునకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అధికారం అండతో, మోసపూరిత భూ లావాదేవీలు వీళ్ళు భారీగా జరిగినట్లు అధికారులు గుర్తించారు. అవినీతి నిరోధక, నేర చట్టాల సెక్షన్ల ప్రకారం జప్తునకు అనుమతించాలని సిట్ కోరింది.
Also Read : మల్లోజుల మరో సంచలన వీడియో.. చనిపోవద్దు ప్లీజ్..!
తదుపరి ఉత్తర్వులు తీసుకోవాలని, డీజీపీని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఈ కేసులో మరో కీలక పరిణామం కూడా చోటు చేసుకుంది. ప్రస్తుతం బెయిల్ మీద బయట ఉన్న వైయస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత సన్నిహితులు.. కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డిల బెయిల్ రద్దు చేసింది ఏపీ హైకోర్టు. ఏసీబీ కోర్టు, ముగ్గురు నిందితులకు ఇచ్చిన డీఫాల్ట్ బెయిల్ రద్దు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సిఐడి అధికారులు వేసిన పిటీషన్ పై విచారణ జరిపిన కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. వీరితోపాటుగా వైయస్ భారతీ వ్యాపార వ్యవహారాలు చూసే బాలాజీ గోవిందప్ప బెయిల్ కూడా రద్దయింది.

