తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ మరింత సౌకర్యవంతమైన సౌకర్యాలు కల్పించే దిశగా చర్యలు చేపట్టింది. స్వామి దర్శనానికి వచ్చే భక్తులు ఇకపై గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉండకుండా ఏఐ టెక్నాలజీ సాయంతో గంటలోపే స్వామి దర్శనం అయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. టెక్నాలజీని వినియోగించుకుంటూ భక్తులకు మరింత మెరుగైన, సులభమైన సేవలు అందించే దిశగా టీటీడీ బోర్డు నిర్ణయాలు తీసుకుంటోంది.
Also Read : బ్రేకింగ్: ఐబొమ్మ హెడ్ అరెస్ట్.. ఎక్కడంటే..?
తిరుమల వచ్చిన భక్తులు ఇప్పటికీ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వసతి గదులు తీసుకోవడం నుంచి దర్శనం క్యూ లైన వరకు ఎటు వెళ్లాలి.. ఎక్కడ బస చేయాలి.. ఎవరికి ఫిర్యాదు చేయాలనే విషయాలు తెలియక ఇప్పటికీ తికమకపడుతున్నారు. ఇందుకు టీటీడీ పరిష్కారం చూపుతోంది. ప్రముఖ టెక్ సంస్థ అమెజాన్ వెబ్ సర్వీసెస్ భాగస్వామ్యంతో త్వరలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చాట్ బాట్ను అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.
ఈ ఏఐ చాట్ బాట్ ద్వారా శ్రీవారి భక్తులు వసతి గదుల లభ్యత మొదలు.. స్వామి దర్శనం, విరాళాలు, సేవలు, ఫిర్యాదులు, సూచనలకు సంబంధించిన సమాచారాన్ని క్షణాల్లో పొందవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల సౌకర్యం కోసం మొత్తం 13 భాషల్లో ఈ చాట్ బాట్ అందుబాటులోకి రానుంది. భక్తులు తమ సలహాలు, సూచనలు, ఫిర్యాదులు కూడా నేరుగా చాట్ బాట్ ద్వారా టీటీడీ దృష్టికి తీసుకెళ్లవచ్చు.
Also Read : జూబ్లిహిల్స్ లో టీడీపీ క్యాడర్ ఏం చేసింది..?
ఈ చాట్ బాట్లో టచ్ కియోస్క్తో పాటు స్పీచ్ టూ టెక్ట్స్, టెక్ట్స్ టూ స్పీచ్ వంటి ఆధునిక సదుపాయాలు కూడా అందుబాటులోకి రానుంది. దీని వల్ల ప్రతి ఒక్కరు వాయిస్ కమాండ్ ద్వారా కూడా కావాల్సిన సమాచారాన్ని పొందవచ్చు. టైప్ చేయడం రాని వారు కూడా వాయిస్ కమాండ్తో సేవలు పొందవచ్చు. ఈ సాఫ్ట్వేర్ను ఐటీ దిగ్గజ సంస్థ టీసీఎస్ అభివృద్ధి చేస్తోంది. టీటీడీ పాలనలో పారదర్శకత పెంచడంతో పాటు, ఎస్వీబీసీ ఛానల్ ప్రసారాలను కూడా మెరుగు పరిచే దిశగా టీటీడీ చర్యలు చేపడుతోంది. ఈ కొత్త టెక్నాలజీ ద్వారా భక్తులకు మరింత సులువుగా సమాచారం అందుబాటులోకి వస్తుందని టీటీడీ అధికారులు తెలిపారు.

