తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ ఈవోగా పనిచేసిన ఏవీ ధర్మారెడ్డిని ప్రత్యేక దర్యాప్తు బృందం.. సిట్ సుదీర్ఘంగా విచారించింది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు దాదాపు 8 గంటల పాటు డీఐజీ మురళీ రాంబా నేతృత్వంలోని బృందం ఆయనను ప్రశ్నించింది.
Also Read : వైవీ సుబ్బారెడ్డి అరెస్ట్..? ఆయన్ను కూడా..?
శ్రీవారి లడ్డూ ప్రసాదానికి కల్తీ నెయ్యి వినియోగించారనేది కోట్ల మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన అంశం. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఈ కేసు దర్యాప్తు వేగంగా జరుగుతోంది. కల్తీ నెయ్యి సరఫరా వెనుక భారీ ఎత్తున అవినీతి ఉందనే ఆరోపణలతో దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు.. ఇప్పటికే మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు చిన్న అప్పన్నను అరెస్టు చేశారు. ఈ కేసులో రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తి అరెస్ట్ కావడం ఇదే తొలిసారి కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేయడంలో అప్పన్న కీలక పాత్ర పోషించాడని సిట్ అధికారులు భావిస్తున్నారు.
ఈ కేసులో మాజీ ఈవో ధర్మారెడ్డిని సిట్ అధికారులు విచారించారు. ఈ విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. కల్తీ నెయ్యి కేసులో ధర్మారెడ్డి అప్రూవర్గా మారారు బోలేబాబా, ఏఆర్ డెయిరీ డైరెక్టర్లతో సంప్రదింపులు జరిపినట్లు ధర్మారెడ్డి అంగీకరించారు. కల్తీ నెయ్యి సరఫరా అవుతోందని సీఎఫ్టీఆర్ఐ ఇచ్చిన రిపోర్టును తాను కూడా చూసినట్లు ధర్మారెడ్డి స్టేట్మెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కల్తీ నెయ్యి సరఫరా అవుతుందని నాటి చైర్మన్ సుబ్బారెడ్డికి కూడా తెలుసన్న ధర్మారెడి.. తాను బాధ్యతాయుతంగా వ్యవహరించి ఉంటే బాగుండేదని పశ్చాత్తాపం చెందినట్లు తెలుస్తోంది.
Also Read : లోకేష్ బాటలో జగన్.. వర్కవుట్ అవుతుందా..?
కల్తీ నెయ్యి సరఫరా అవుతున్న విషయం తనకు ముందే తెలుసని ధర్మారెడ్డి ఒప్పుకున్నట్లు సమాచారం. అయితే లడ్డూకు కల్తీ నెయ్యి వస్తుంటే ఎందుకు చూసీ చూడనట్లు వ్యవహరించారని ప్రశ్నించగా.. హైకమాండ్ ఒత్తిడి వల్లే అనుమతించాల్సి వచ్చిందని ధర్మారెడ్డి చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే, ఆ హైకమాండ్ ఎవరనే ప్రశ్నకు మాత్రం ధర్మారెడ్డి నుంచి ఎలాంటి సమాధానం రాలేదని తెలుస్తోంది. ధర్మారెడ్డి పలు ప్రశ్నలకు క్లుప్తంగా బదులివ్వగా, మరికొన్నింటికి అయితే మౌనం వహించారని సమాచారం.
2022 ఆగస్టులోనే మైసూరు ల్యాబ్ నుంచి నెయ్యి కల్తీ జరిగిందని నివేదిక వచ్చినా ఎందుకు చర్యలు తీసుకోలేదు, భోలేబాబా డెయిరీకి కాంట్రాక్టు కట్టబెట్టేందుకే టెండర్ నిబంధనల్లో మార్పులు చేశారా, గతంలో ఉన్న మిల్క్ పదాన్ని 2020లో ఎందుకు తొలగించారు, తిరిగి 2023లో ఎందుకు చేర్చారు.. ఈ మార్పుల ద్వారా ఎవరికి లబ్ధి చేకూర్చారు వంటి ప్రశ్నలను సిట్ అధికారులు ధర్మారెడ్డికి సంధించినట్లు తెలుస్తోంది. అయితే కేవలం హైకమాండ్ ఒత్తిడి వల్లే తాను సైలెంట్గా ఉన్నట్లు ధర్మారెడ్డి స్టేట్మెంట్ ఇచ్చారు. ధర్మారెడ్డి అప్రూవర్గా మారారనే విషయం ఇప్పుడు వైసీపీ నేతల్లో కలకలం రేపుతోంది. ఇప్పటికే వైవీ సుబ్బారెడ్డి పీఏ అప్పన్నను అదుపులోకి తీసుకున్న సిట్ అధికారులు.. మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : జగన్ అసెంబ్లీకి ఎందుకు రావటం లేదో తెలుసా..?
ఈ కేసులో ఇప్పటికే అరెస్టై బెయిల్పై ఉన్న భోలేబాబా డెయిరీ డైరెక్టర్లు పొమిల్ జైన్, విపిన్ జైన్లను కూడా సిట్ విచారించింది. ఐదేళ్లలో ఈ సంస్థ 251 కోట్లకు పైగా విలువైన 68.17 లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా చేసినట్లు తమ దర్యాప్తులో తేలిందని డీఐజీ మురళీ రాంబా వెల్లడించారు. ఈ వ్యవహారంలో టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పాత్రపైనా అధికారులు ఆరా తీసినట్లు తెలుస్తోంది.

