ఆర్కే రోజా.. ఈ పేరు తెలియని వారు చాలా అరుదు. తెలుగు రాష్ట్రాల్లో ఫైర్ బ్రాండ్గా రోజా గుర్తింపు తెచ్చుకున్నారు. 90ల్లో వెండితెరపై ఓ వెలుగు వెలిగారు రోజా. కొత్త తరం వస్తున్న సమయంలోనే సైలెంట్గా రాజకీయాల్లోకి వచ్చారు. తెలుగుదేశం పార్టీలో చేరిన రోజా.. దూకుడుగా వ్యవహరించడంతో తెలుగు మహిళ అధ్యక్ష పదవిని కట్టబెట్టారు. 2004 ఎన్నికల్లో నగరి నుంచి 2009లో చంద్రగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత అనూహ్యంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వైఎస్ఆర్ మరణానంతరం జగన్కు మద్దతు తెలిపిన రోజా.. వైసీపీలో కీలక నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు.
Also Read : కల్తీ మద్యం: తాతల కాలం నుంచే జోగి – అద్దేపల్లి కుటుంబాల స్నేహం
2014లో నగరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచిన రోజా.. శాసనసభలో అనుచిత ప్రవర్తన కారణంగా సస్పెండ్ అయ్యారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో గెలిచిన రోజాను మంత్రిని చేశారు జగన్. ప్రతిపక్ష నేత చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ పైన ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యానించిన రోజా.. ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్గా గుర్తింపు తెచ్చుకున్నారు. 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత రోజా సైలెంట్ అయ్యారు. పూర్తిగా తమిళనాడుకే పరిమితం అయ్యారనే మాట వినిపిస్తోంది.
ప్రేమతపస్సు సినిమా ద్వారా చిత్తూరు టీడీపీ మాజీ ఎంపీ శివప్రసాద్ ప్రోత్సాహంతో సినిమాల్లోకి వచ్చారు రోజా. ఆ తర్వాత స్టార్ హీరోయిన్గా కొద్ది రోజుల పాటు సిల్వర్ స్క్రీన్ పైన చెలాయించారు. అగ్ర హీరోలందరితో నటించిన రోజా.. ప్రముఖ దర్శకులు సెల్వమణిని ప్రేమ వివాహం చేసుకున్నారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కొద్ది కాలం పాటు సినిమాలకు గుడ్ బై చెప్పారు. అయితే శంభో శివ శంభో, గోలీమార్ వంటి సినిమాల్లో మాత్రం అప్పుడప్పుడు కనిపించారు. ఇక బుల్లి తెరపై రోజా ఇప్పటికీ కొనసాగుతున్నారు. ఈటీవీ జబర్దస్త్, జీ తెలుగు బతుకు జట్కాబండి, జెమినీ టీవీ రంగస్థలం వంటి కార్యక్రమాలకు ప్రయోక్తగా వ్యవహరించారు.
Also Read : ఎమ్మార్వో ఆఫీస్ కు మాగంటి ఫ్యామిలీ పంచాయతీ..!
ప్రస్తుతం రాజకీయాలకే రోజా పరిమితమయ్యారు. అయితే అనూహ్యంగా ఓ తమిళ సినిమాలో రోజా నటిస్తున్నారు. రాజకీయాల్లో బిజీగా ఉంటున్నప్పటికీ.. నటిగా అవకాశం వస్తే చేస్తా అంటూ రోజా ప్రకటించారు. బాలచంద్రన్ దర్శకత్వం వహించిన లెనిన్ పాండియన్ అనే తమిళ సినిమాలో రోజా సంతానం అనే పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో రోజా లుక్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. 90స్ క్వీన్ ఇలా మారిపోయారేంటి.. అని కామెంట్లు చేస్తున్నారు. అయితే రోజా కొత్త లుక్పై నాటి తరం నటులు కితాబిస్తున్నారు. వెల్కమ్ డియర్ అంటూ ప్రముఖ నటి కుష్బూ, ప్రభుదేవా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే నెటిజన్లు మాత్రం.. ఏపీలో రోజాకు కావాల్సినంత చెడ్డ పేరు వచ్చింది కాబట్టే.. ఇప్పుడు సైలెంట్గా తమిళనాడు వెళ్లిపోయారని.. రాబోయే ఎన్నికల్లో తమిళనాడు నుంచే రోజా పోటీ చేస్తారేమో అని కామెంట్లు చేస్తున్నారు.

