తెలుగుదేశం పార్టీలో కొన్ని నియోజకవర్గాల్లో అంతర్గత విభేదాలు పార్టీకి తలనొప్పిగా మారడం కార్యకర్తలను ఇబ్బంది పెడుతోంది. రాజకీయంగా బలంగా ఉన్నామనే సంతోషం మినహా కొందరు నాయకుల వ్యవహార శైలి చూసి కార్యకర్తలు కుమిలిపోతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణాజిల్లాలో చోటుచేసుకుంటున్న పరిణామాలు చికాకుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా సీఎం చంద్రబాబు ఆసక్తికర కామెంట్స్ చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్య నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేసీనేని చిన్ని వ్యవహారంపై ఈ సందర్భంగా ప్రస్తావన వచ్చింది.
Also Read : రోహిత్ పెళ్లిలో అంతా తానైన చంద్రబాబు.. మరి జూనియర్ ఎక్కడ?
ఈ ఇద్దరి తీరుపై ముఖ్యమంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారాన్ని పార్టీ క్రమశిక్షణ కమిటీకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యే కొలికపూడి, ఎంపీ చిన్ని ఇద్దరినీ పిలిచి మాట్లాడాలని ఆదేశించారు. ఇరు వర్గాల నుంచి వివరణ తీసుకుని తనకు నివేదిక ఇవ్వాలని సూచించారు. విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత తాను ఇద్దరితో మాట్లాడతానని ముఖ్యమంత్రి కామెంట్ చేసినట్లు తెలుస్తోంది. వాస్తవానికి చంద్రబాబు దుబాయ్ పర్యటనలో ఉన్న సమయంలో.. ఈ ఇద్దరితో తానే నేరుగా మాట్లాడుతానని, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మాట్లాడొద్దని ఆదేశించినట్లు తెలిసింది.
Also Read : భారతి సిమెంట్ మేనేజర్ పై కేసు..!
కానీ తాజాగా చంద్రబాబు.. తన లండన్ పర్యటన ముగిసిన తర్వాత వారితో మాట్లాడతానని చెప్పినట్లుగా సమాచారం. విభేదాలు కొలిక్కి రాకపోతే మాత్రం చర్యలు తప్పవని, క్రమశిక్షణను ఎవరు ఉల్లంఘించినా సరే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కొంతమంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి సహాయనిది సిఫారసు లేఖలు ఇవ్వడం లేదని కూడా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సీఎంఆర్ఎఫ్ లేఖలు ఇవ్వని ఎమ్మెల్యేలు జాబితా సిద్ధం చేయాలని ఆదేశించారు. ఇకపై వారంలో ఒకరోజు పార్టీ కార్యాలయానికి కేటాయిస్తానంటూ నేతల వద్ద ప్రస్తావించారు చంద్రబాబు. పార్టీలో జరుగుతున్న వ్యవహారాలపై రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు దృష్టి సారించాలని సూచించారు.

