ఏదైన ఘటన జరిగినప్పుడు ఠక్కున నిర్ణయాలు తీసుకోవాలి. రాజకీయాల్లో అయితే కాస్త ముందు వెనుక ఆలోచించి మనకు నష్టం జరగకూడదు అనే జాగ్రత్తలు తీసుకుని మరీ నిర్ణయాలు తీసుకుంటారు. కొంతమంది నేతలు అయితే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుంటారు. కొంతమంది ప్రజా ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ఆన్ ది స్పాట్ డెసిషన్ తీసుకుంటారు. ఇలాంటి వారిలో ఎన్టీఆర్ ముందు వరుసలో ఉంటారు. రైతులకు, ప్రజలకు మేలు జరుగుతుందని ఎవరైనా చెబితే చాలు.. ఠక్కున నిర్ణయాలు తీసుకుని ఆఘమేఘాల మీద ఉత్తర్వులు కూడా జారీ చేస్తారు. అలాగే ఎక్కడైనా లోపం ఉందని తెలిస్తే.. ముందు వెనుక చూసుకోకుండా ఎలాంటి కఠినమైన నిర్ణయమైనా సరే తీసేసుకుంటారు. ఒకసారి రూపొందించిన బడ్జెట్ ముందు రోజే పేపర్లో రావడంతో.. తీవ్ర ఆగ్రహానికి గురైన ఎన్టీఆర్.. ఏకంగా మంత్రివర్గాన్ని భర్తరఫ్ చేశారు. అందుకే టీడీపీ అంటే క్రమశిక్షణకు మారుపేరు కూడా. కానీ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు పార్టీ సీనియర్ నేతలను కూడా కలవరపెడుతున్నాయి.
Also Read : తిరుమల లడ్డు కేసులో వెలుగులోకి పాపాలు..!
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంటే ప్రతి ఒక్కరికీ గౌరవం. ఆయన మాటే ప్రస్తుతం వేదం. ఆయన చెప్పిన మాటను, పెట్టిన రూల్స్ను పార్టీ నేతలు, కార్యకర్తలు తూ చా తప్పకుండా పాటిస్తున్నారు కూడా. చిన్న సమావేశమైన సరే.. భారీ బహిరంగ సభ అయినా సరే.. ఆయన చెప్పిందే పార్టీ నేతలకు వేద వాక్కు. ఇక పార్టీ లైన్ దాటిన నేతల విషయంలో చంద్రబాబు చాలా కఠినంగా వ్యవహరిస్తారని ప్రతి ఒక్కరికీ తెలుసు. గతంలో కూడా ఇదే మాదిరిగా పార్టీ లైన్ దాటిన వారిపై సస్పెన్షన్ వేటు వేశారు చంద్రబాబు. ఇటీవల కల్తీ మద్యం తయారీ కేసులో కీలకమైన వ్యక్తి అనే ఆరోపణలు వచ్చిన ఇద్దరు పార్టీ నేతలను వెంటనే సస్పెండ్ చేశారు. కానీ కొన్ని విషయాల్లో మాత్రం చంద్రబాబు వేగంగా స్పందించడం లేదనే మాట వినిపిస్తోంది. దీని వల్ల కొందరు అధినేత మాటను కూడా లెక్క చేయడం లేదని తెలుస్తోంది.
ఏపీ టీడీపీలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, ఎంపీ కేశినేని చిన్ని మధ్య వివాదం రోజు రోజుకు పెద్దదవుతోంది. ఎమ్మెల్యే టికెట్ కోసం చిన్ని తన దగ్గర రూ.5 కోట్లు తీసుకున్నారని కొలికపూడి చేసిన ఆరోపణలు పెద్ద దుమారం రేపాయి. అలాగే వైసీపీ నుంచి వారి దగ్గర డబ్బులు తీసుకుని పదవులిస్తున్నారని.. వైసీపీ నేతలతో చిన్ని వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నారని కూడా కొలికపూడి ఆరోపించారు. ఎంపీ కేశినేని చిన్నిని తిరువూరు నియోజకవర్గంలో కాలు పెట్టనివ్వనని కొలికపూడి సవాల్ కూడా విసిరారు. దీంతో ఈ వ్యవహారం అధినేత వరకు చేరింది. ముందు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఈ ఇద్దరు నేతలతో చర్చించాలని భావించినట్లు తెలిసింది. అయితే దుబాయ్ పర్యటనలో ఉన్న చంద్రబాబు.. ఇద్దరు నేతలతో తానే స్వయంగా మాట్లాడుతానని.. అప్పటి వరకు సైలెంట్గా ఉండాలని సూచించినట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఈ వ్యవహారం ఓ నాలుగు రోజుల పాటు సైలెంట్ అయ్యింది. ఇక ఏపీ తిరిగి వచ్చిన తర్వాత మొంథా తుఫాన్ పనుల్లోనే చంద్రబాబు మునిగిపోయారు. ఆ తర్వాత తన తమ్ముడి కుమారుడు నారా రోహిత్ వివాహ వేడుకల కోసం హైదరాబాద్ వెళ్లారు. దీంతో కొలికపూడి, కేశినేని పంచాయతీపై దృష్టి పెట్టలేదు.
Also Read : ఎటు పోతోంది ఈ సమాజం.. ఇంత దారుణమా..!
ఇదే అదనుగా భావించిన ఎమ్మెల్యే కొలికపూడి మరోసారి తన నోటికి పని చెప్పారు. తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానన్నారు. ఢిల్లీలో పేకాట ఆడుతున్న సమయంలో ఎంపీని పోలీసులు పట్టుకున్నారని కొత్త ఆరోపణలు చేశారు. అలాగే ఓ వైపు మొంథా తుఫాన్ వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. ఎంపీ చిన్ని ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. అధినేత నుంచి కార్యకర్త వరకు తుఫాన్ బాధితుల కోసం పని చేస్తుంటే.. ఎంపీ ఎక్కడా అని నిలదీశారు. చిన్ని బంఢారం మొత్తం తన దగ్గర ఉందని కొత్త బాంబు పేల్చారు. ఓ వైపు అధినేత సైలెంట్గా ఉండాలని సూచించినా.. కొలికపూడి మాత్రం అవేవీ పట్టించుకోవటం లేదు. ఇందుకు ప్రధాన కారణం.. కొలికపూడి వెనుక సొంత పార్టీకే చెందిన ఓ బలమైన నేత ఉన్నారనే మాట వినిపిస్తోంది. అదే సమయంలో కొలికపూడిపై చర్యలు తీసుకుంటే.. తన సామాజిక వర్గానికి చెందిన ఎంపీని కాపాడుకునేందుకు ఓ ఎస్సీపైన చర్యలు తీసుకున్నారనే ఆరోపణలు వస్తాయని చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ వ్యవహారాన్ని చంద్రబాబు లైట్ తీసుకున్నారనే మాట వినిపిస్తోంది. ఈ విషయంలో ఏం చేయాలో తెలియకే చంద్రబాబు సైలెంట్గా ఉన్నారనే మాట ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తోంది.

