విదేశాలతో వాణిజ్య ఒప్పందాల విషయంలో కేంద్ర ప్రభుత్వం దూకుడు ప్రదర్శిస్తోంది. తాజాగా బ్రిటన్ తో ఒప్పందాల విషయంలో మోడీ సర్కార్ అడుగులు వేస్తోంది. జూలై 24న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లండన్ పర్యటన సందర్భంగా వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయనున్నారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మూడు సంవత్సరాల చర్చల తర్వాత, మే 6న రెండు దేశాలు వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు ముగింపు దశకు చేరుకున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.
Also Read : మహిళ దెబ్బకు షాక్ అయిన సుప్రీం ఛీఫ్ జస్టిస్
2030 నాటికి రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని భావిస్తున్నారు. దీనిని 120 బిలియన్ డాలర్లకు తీసుకువెళ్ళే విధంగా అడుగులు వేయనున్నారు. బ్రిటన్ నుండి విస్కీ, కార్ల దిగుమతులను చౌకగా చేసుకోవాలని భారత్ భావిస్తోంది. ఇదే సమయంలో మన దేశం నుంచి ఎగుమతయ్యే.. తోలు, పాదరక్షలు, దుస్తులు వంటి శ్రమతో కూడిన ఉత్పత్తుల ఎగుమతిపై పన్నులను తొలగించాలని వాణిజ్య ఒప్పందంలో పేర్కొన్నారు. ఈ వాణిజ్య ఒప్పందంపై కేంద్ర కేబినేట్ ఆమోదం తెలిపింది.
Also Read : ఓన్లీ క్యాష్.. నో యూపీఐ ప్లీజ్.. వ్యాపారులకు షాక్..!
ఇక బ్రిటన్ పార్లమెంట్ లో ఆమోదం పొందాల్సి ఉంది. భారత్ లో బ్రిటన్ ఆరవ అతిపెద్ద పెట్టుబడిదారుగా ఉంది. దాదాపు 36 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది. ఇక బ్రిటన్ లో 1,000 భారత కంపెనీలు ఉన్నాయి. లక్ష మంది ఉద్యోగులు ఉండగా.. మొత్తం 2 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టారు. 2024-25లో మన దేశం నుండి యూకేకి ఎగుమతులు 12.6% పెరిగి 14.5 బిలియన్ డాలర్లకు చేరుకోగా, దిగుమతులు 2.3% పెరిగి 8.6 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఈ పర్యటన తర్వాత ప్రధాని మాల్దీవుల పర్యటనకు వెళ్లనున్నారు.