2008 లో దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. 170 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన ఈ దాడి విషయంలో విచారణ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ దాడుల్లో కీలక సూత్రధారి తహవూర్ రానాను అమెరికా నుంచి భారత్ కు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతనిని దర్యాప్తు సంస్థలు పెద్ద ఎత్తున విచారిస్తున్నాయి. ఈ విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ దాడిలో తన పాత్ర గురించి రానా అంగీకరించినట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.
Also Read : అప్పుడు లేని నొప్పి ఇప్పుడు ఎందుకు..? మస్క్ పై ట్రంప్ సీరియస్
26/11 ముంబై దాడుల కీలక కుట్రదారుడుగా భావిస్తున్న రానా వయసు 64 ఏళ్ళు. ఉగ్రదాడి ఎలా నిర్వహించారు అనే దానిపై అతను పలు విషయాలను బయటపెట్టాడు. ముంబై పోలీస్ క్రైమ్ బ్రాంచ్ వర్గాల సమాచారం ప్రకారం, దాడుల సూత్రధారి డేవిడ్ కోల్మన్ హెడ్లీకి ఛత్రపతి శివాజీ టెర్మినస్ వంటి కీలక లక్ష్యాలను గుర్తించడంలో ఏ విధంగా సహాయం చేసాడో వివరించాడు. పాకిస్తాన్లోని రావల్పిండిలోని ఆర్మీ మెడికల్ కాలేజీ నుండి 1986లో ఎంబీబీఎస్ కోర్సు పూర్తి చేశానని, క్వెట్టాలో ఉన్న పాకిస్తాన్ ఆర్మీలో కెప్టెన్ డాక్టర్గా విధుల్లో చేరినట్టు తెలిపాడు.
సింధ్, బలూచిస్తాన్, బహవల్పూర్, సియాచిన్-బలోత్రా వంటి సున్నితమైన ప్రాంతాలలో అతను విధులు నిర్వహించాడు. సియాచిన్లో ఉన్న సమయంలో, రాణాకు పల్మనరీ ఎడెమా వచ్చింది. దీనితో అతను విధులకు హాజరు కాలేక పోయాడు. ఆ సమయంలో అతను విధుల్లో పాల్గొనకుండా పారిపోయాడు అని పాకిస్తాన్ ఆర్మీ ప్రకటించింది. ఆ తర్వాత, హెడ్లీ అతనికి పరిచయమై.. రాణా రికార్డులను క్లియర్ చేయడంలో సహాయం చేస్తానని హామీ ఇవ్వడంతో ఉగ్రదాడిలో రానా భాగం అయ్యాడట.
Also Read : వాయు కాలుష్యంతో గుండెపోటు.. శాస్త్రవేత్తల వార్నింగ్
ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చిన పాకిస్తాన్ సైనిక అధికారులు తనను నమ్మారని.. గల్ఫ్ యుద్ధం సమయంలో తనను సౌదీ అరేబియాకు రహస్య మిషన్ కోసం పంపారు అని రానా వెల్లడించాడు. ఆ తర్వాత అతను కెనడాలో స్థిరపడ్డాడు. అంతకు ముందు యూకే, యూఎస్ లో కూడా నివాసం ఉన్నట్టు తెలిపాడు. రానా, హెడ్లీ 1974, 1979 మధ్య హసన్ అబ్దాల్లోని క్యాడెట్ కాలేజీలో కలిసి చదివారట. హెడ్లీ తల్లి అమెరికన్, అతని తండ్రి పాకిస్తాన్ జాతీయుడు. హెడ్లీ తన సవతి తల్లితో విభేదాల తర్వాత అమెరికాకు పారిపోయి తన కన్నతల్లితో కలిసి జీవించడం మొదలుపెట్టాడట.
2003, 2004 మధ్య హెడ్లీ మూడు లష్కరే తోయిబా శిక్షణా శిబిరాలకు హాజరయ్యాడని రానా వెల్లడించాడు. లష్కర్ ఒక సైద్ధాంతిక సంస్థగా కంటే గూఢచారి నెట్వర్క్గా ఎక్కువగా పనిచేస్తుందని హెడ్లీ తనకు చెప్పినట్టు విచారణలో వెల్లడి అయింది. 26/11 కేసులో ఎన్ఐఏ ఛార్జిషీట్ ప్రకారం, హెడ్లీ ఇమ్మిగ్రెంట్ లా సెంటర్ అనే కంపెనీ ప్రతినిధిగా చెప్పుకుని.. ఢిల్లీ, ముంబై, జైపూర్, పుష్కర్, గోవా మరియు పూణేతో సహా అనేక నగరాలలో ప్రయాణించాడు.
Also Read : ఆ విషయంలో అంత తొందర ఎందుకు..?
ఈ ఆఫీస్ కేంద్రంగానే ముంబై దాడులకు నిఘా నడిపారని వెల్లడించాడు. ఉగ్రవాద దాడులకు కొన్ని రోజుల ముందు, 2008 నవంబర్లో తాను దేశంలో అడుగుపెట్టాను అని.. 20, 21 తేదీల్లో ముంబైలోని పోవాయ్లోని ఒక హోటల్లో బస చేశానని రాణా వెల్లడించాడు. దాడికి ముందు, అతను దుబాయ్ మీదుగా బీజింగ్కు వెళ్ళాడు. 2023లో క్రైమ్ బ్రాంచ్ దాఖలు చేసిన 405 పేజీల అనుబంధ ఛార్జిషీట్లో, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ వంటి రద్దీగా ఉండే ప్రాంతాల గురించి సమాచారాన్ని సేకరించడానికి హెడ్లీకి రానా సహాయం చేశాడని పేర్కొంది.