ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో మార్పులు చేర్పులు అంటూ ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతుంది. మంత్రివర్గ విషయంలో ప్రభుత్వ పెద్దలు ఏ నిర్ణయం తీసుకుంటారనే దానిపై స్పష్టత రావటం లేదు. వంగవీటి రాధా, సుజనా చౌదరి, జవహర్, కడప జిల్లాకు చెందిన పలువురి పేర్లు ఎక్కువగా వినిపించాయి. కానీ దీనిపై ప్రభుత్వ పెద్దలు మాత్రం ఇప్పటివరకు తమ నిర్ణయాన్ని బహిరంగంగా ఎక్కడ ప్రకటించలేదు. కొన్ని రోజులు నాగబాబు పేరు కూడా ప్రముఖంగా చర్చల్లోకి వచ్చింది.
Also Read : ద్వారంపూడికి మ్యూజిక్ స్టార్ట్ అయినట్టే..?
దీనిపై జనసేన పార్టీతో పాటుగా తెలుగుదేశం పార్టీ కూడా అధికారికంగా ప్రకటన చేశాయి. నాగబాబుని మార్చిలో క్యాబినెట్లోకి తీసుకుంటామని అప్పట్లో పవన్ కళ్యాణ్ ప్రకటించారు. కానీ పలు కారణాలతో నాగబాబు క్యాబినెట్లోకి రావడం వాయిదా పడింది. ఇక ఇప్పుడు ప్రముఖంగా వినపడుతున్న పేరు రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి. మంత్రివర్గంలోకి రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి రావడం ఖాయమంటూ సోషల్ మీడియాలో పలువురు అభినందిస్తూ పోస్టులు పెడుతున్నారు. ఇటీవల మహానాడు కడపలో నిర్వహించింది తెలుగుదేశం పార్టీ. ఈ కార్యక్రమం ఘనవిజయం సాధించడంలో శ్రీనివాస్ రెడ్డి కీలకపాత్ర పోషించారు.
Also Read : ఎందుకీ శాడిజం..? హెలికాప్టర్, సైకిల్.. ఇప్పుడు పోలీస్ వ్యాన్
2024 ఎన్నికల్లో కడప నియోజకవర్గ నుంచి ఆయన సతీమణి రెడ్డప్ప గారి మాధవి రెడ్డి విజయం సాధించడంలో కూడా శ్రీనివాసరెడ్డిది కీలకపాత్ర. పార్టీలో పదవులు ఉన్నా సరే ప్రభుత్వంలో మాత్రం ఆయనకు పదవి దక్కలేదు. దీనితో ఎమ్మెల్సీ చేసి ఆయనను మంత్రిని చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇటీవల మహానాడు సందర్భంగా చంద్రబాబు నాయుడు ఇదే విషయాన్ని శ్రీనివాస్ రెడ్డి వద్ద ప్రస్తావించినట్లు సమాచారం. ప్రస్తుత ఆయన కడప పార్లమెంట్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. జూన్ లేదా జూలై నెలలో దీనిపై అధికారికి ప్రకటన వెలువడే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు అంటున్నాయి.