ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం విచారణలో దర్యాప్తు అధికారులు మరో ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. తమిళనాడుకు చెందిన ఎస్ఎన్జే షుగర్స్, ప్రొడక్ట్స్ లిమిటెడ్కు చెందిన జయ మురుగున్, మాతప్పన్ను వాట్సప్, ఫేస్బుక్ ద్వారా లిక్కర్ కేసులో కీలకంగా ఉన్న ప్రకాశ్, కసిరెడ్డి రాజశేఖర్రెడ్డి సంప్రదించారని.. విజయసాయిరెడ్డి, మిథున్రెడ్డికి దగ్గరి వాళ్లమని పరిచయం చేసుకుంటూ, మద్యం అమ్మకాలకు సంబంధించి లంచాలు చెల్లించాలని లేదంటే పరిశ్రమను సబ్ లీజ్కు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారని దర్యాప్తు అధికారుల విచారణలో వెల్లడి అయింది.
Also Read : హస్తినలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు..? రేవంత్ రెడ్డికి షాక్ తప్పదా..?
ఇక ఈ విషయంలో ఆయా సంస్థలు తిరస్కరించడంతో 2019 సెప్టెంబరు, అక్టోబరు నెలలకు సంబంధించిన 16 కోట్ల చెల్లింపులను ఆపేశారని, కమీషన్లు చెల్లించేందుకు నిరాకరించిన పెరల్స్ డిస్టిలరీ, బీవీఎస్ డిస్టిలరీ, ఇతర సంస్థలు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయని అధికారులు పేర్కొన్నారు. వాటికి ఆర్డర్లు తగ్గించారని.. అమ్మకాలు గణనీయంగా ఉన్నా ఉద్దేశపూర్వకంగానే మార్కెట్ నుంచి తొలగించారని గుర్తించారు. తమ మాట వినకపోతే ఎవరికైనా ఇలాగే జరుగుతుందని వీరు వార్నింగ్ లు ఇచ్చినట్టు తేల్చారు.
Also Read : వైసీపీ – టీడీపీ మధ్య ప్యాలెస్ వార్..!
కమీషన్ ఇవ్వాలని మాన్షన్ హౌస్ బ్రాండ్ ప్రతినిధి జయపాల్రెడ్డిపై ఒత్తిడి తెచ్చారని.. అంగీకరించకపోవడంతో చెల్లింపులు నిలిపేసి, కంపెనీకి ఆర్డర్లను బ్లాక్ చేసి దారికి తెచ్చుకున్నారని పేర్కొన్నారు. ప్రకాశ్, చాణక్య అనే వారికి లంచాల సొమ్మును అప్పగించాలని సూచించారని, జయపాల్రెడ్డికి చెందిన సిబ్బంది శ్రీనాథ్, ప్రవీణ్ వారితో సమన్వయం చేసుకుంటూ బంగారం రూపంలో అందించారని గుర్తించారు. బంగారం దుకాణాలకు ముడుపుల సొమ్ము మళ్లించి చట్టబద్ధమైన లావాదేవీలుగా చూపి లంచాలుగా చెల్లించారని ఇలా ఈ బ్రాండ్ ద్వారా 1,400 కోట్ల విలువైన సుమారు 65 లక్షల కేసుల మద్యం విక్రయించారని విచారణలో వెల్లడి అయింది. 20 శాతం కమీషన్ లెక్కన సుమారు 280 కోట్ల మేర ముడుపులుగా మద్యం మాఫియాకు చేరాయని తేల్చారు.