ఏపీలో వైసీపీకి ఆ పార్టీ నేతలు వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడే లావు కృష్ణదేవరాయలు, సీ.రామచంద్రయ్య వంటి నేతలు వైసీపీకి రాజీనామా చేయగా.. ఎన్నికల తర్వాత మాజీ మంత్రులు బాలినేని, ఆళ్ల నాని, అవంతి శ్రీనివాస్ వంటి నేతలతో పాటు ఎంపీలు మోపిదేవి, విజయసాయిరెడ్డి వంటి అత్యంత ఆప్తులు కూడా జగన్కు గుడ్ బై చెప్పేశారు. వైసీపీకి కీలకమైన నేతలే పార్టీకీ రాజీనామా చేయడంతో.. కిందిస్థాయి నేతల్లో కూడా అసహనం మొదలైంది. ఇక ఎన్నికల తర్వాత ఏడాది కాలంలో వైసీపీకి ఏకంగా ఆరుగురు ఎమ్మెల్సీలు రాజీనామా చేసేశారు. దీంతో శాసన సభతో పాటు మండలిలో కూడా వైసీపీకి ప్రతిపక్ష హోదా పోయే పరిస్థితి తలెత్తుతోంది.
Also Read : ముఖ్యమంత్రి పీ4 ఆదర్శంగా.. గొట్టిపాటి అడుగులు..!
వైసీపీ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది కడప జిల్లా. సుమారు 40 ఏళ్లుగా కడపలో వైఎస్ కుటుంబానిదే ఆధిపత్యం. జిల్లాలోని పులివెందుల నియోజకవర్గం వైఎస్ కుటుంబం కేరాఫ్ అడ్రస్గా మారిపోయింది. అలాగే కడప పార్లమెంట్ స్థానం కూడా 1989 నుంచి వైఎస్ కుటుంబం ఆధీనంలోనే ఉంది. వరుసగా నాలుగు సార్లు రాజశేఖర్ రెడ్డి ఎంపీగా గెలవగా.. ఆ తర్వాత వివేకానంద రెడ్డి, జగన్ మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి విజయం సాధించారు. ఇక 1996లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ మంత్రులంతా కడపలో మకాం వేసినప్పటికీ.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేవలం 5,435 ఓట్ల మెజారిటీతో గెలిచారు. చివరికి గత ఎన్నికల్లో కూటమి హవాలో కూడా అవినాష్ రెడ్డి 62 వేల ఓట్ల మెజారిటీ సాధించారు. అయితే ప్రస్తుతం కడప జిల్లాలో వైఎస్ కుటుంబానికి గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.
Also Read : లోకేష్ కు ప్రమోషన్, మహానాడులో సంచలన నిర్ణయం
కడప జిల్లాకు చెందిన పలువురు సీనియర్ నేతలు ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేశారు. ఇక రెండు రోజుల క్రితం కడప మేయర్ సురేష్పై మునిసిపల్ శాఖ కమిషనర్ వేటు వేశారు. మునిసిపల్ శాఖ నిధులు దుర్వినియోగం చేసినట్లు రుజువు కావడంతో.. సురేష్ను తొలగించారు. ఈ నిర్ణయం వచ్చిన గంటల వ్యవధిలోనే వైసీపీకి గట్టి షాక్ తగిలింది. జిల్లాలోని మైదుకూరు మునిసిపల్ ఛైర్మన్ చంద్ర… అటు పార్టీకి, ఇటు ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. మునిసిపల్ ఛైర్మన్ అయినప్పటికీ.. చంద్రకు మైదుకూరు నియోజకవర్గంలో గట్టి పట్టున్న నేతగా గుర్తింపు ఉంది. ఆర్థికంగా కూడా బలమైన నేత. మైదుకూరులో వరుసగా రెండుసార్లు వైసీపీ గెలుపులో చంద్ర కీలక పాత్ర పోషించారు కూడా. అయితే చంద్ర కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.
Also Read : ఉగ్రవాదిపై ట్రంప్ ప్రసంశలు.. అట్రాక్ట్ చేస్తాడంటూ కామెంట్
పార్టీ అధికారంలో ఉన్న సమయంలో నియోజకవర్గంలో ఎమ్మెల్యే రఘురామిరెడ్డి హవా సాగింది. ఏ పని చేయాలన్నా సరే.. తనకు చెప్పాలని కూడా రఘురామిరెడ్డి గతంలో కార్యకర్తలు, నేతలు, అధికారులను ఆదేశించారు. అయితే 2024 ఎన్నికల తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అధికారం పోవడంతో పార్టీ కార్యకర్తలను పట్టించుకోవడమే మానేశారు. అసలు మైదుకూరులో అందుబాటులో ఉన్న సందర్భాలు కూడా చాలా తక్కువ. సొంత వ్యాపారాలపై దృష్టి పెట్టిన రఘురామిరెడ్డి… సైలెంట్గా హైదరాబాద్, బెంగళూరులోనే ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో కిందిస్థాయి కార్యకర్తల సమస్యలను చంద్ర పలుమార్లు మాజీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. అయితే అధికారం లేదు కదా.. మరిప్పుడు ఏం చేద్దామని రఘురామిరెడ్డి ఎదురు ప్రశ్నలు వేయడంతో చంద్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇక అధినేత జగన్ మోహన్ రెడ్డికి అయినా సరే కలుద్దామని దాదాపు 5 నెలలుగా చంద్ర ప్రయత్నం చేస్తున్నారట. అయితే ఇప్పటికీ సీఎం అనే ట్రాన్స్లోనే ఉన్న జగన్.. నేతలు, కార్యకర్తలకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వటం లేదు. దీంతో అధినేత తీరుపైన తీవ్ర విసుగు చెందిన చంద్ర.. వైసీపీకి షాకిస్తూ పార్టీకి రాజీనామా చేసేశారు.
Also Read : అంగరంగ వైభవంగా పసుపు పండుగ..!
వాస్తవానికి వైసీపీకి కాస్త పరువు నిలబెట్టిన జిల్లాల్లో కడప ఒకటి. గత ఎన్నికల్లో పులివెందుల, బద్వేలు, రాజంపేట నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచారు. అయితే ఈ ముగ్గురు కనీసం ఒక్కరోజు కూడా అసెంబ్లీకి వెళ్లలేదు. కడప జిల్లా డీఆర్సీ సమావేశానికి కూడా హాజరవ్వలేదు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు. ఇక జగన్ మాత్రం తనకు ప్రతిపక్ష హోదా కావాలంటూ చిన్న పిల్లాడి మాదిరిగా మారాం చేస్తున్నారు. దీంతో ప్రజల నుంచి వైసీపీలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలోనే బలమైన నేతలంతా కూడా వైసీపీలో ఉంటే తమ రాజకీయ భవిష్యత్తు కూడా పోతుందనే భయంతో సైలెంట్గా సైడ్ అయిపోతున్నారు. ఇక కడపలో టీడీపీ మహానాడు తర్వాత వైసీపీలో పరిస్థితి ఎలా ఉంటుందో అని ఇప్పటి నుంచే ఆ పార్టీ నేతలకు గుబులు పట్టుకుంది.