ఏపీలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారా.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు దాటినా.. ఇంకా పాత ప్రభుత్వ నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారా.. నాటి ప్రభుత్వ పెద్దల అడుగులకు ఇప్పటికీ మడుగులు ఒత్తుతున్నారా.. కూటమి అధికారంలోకి వచ్చినా మాజీలకు ఏం కావాలో అనే విషయంలో వైసీపీ పెద్దల హవానే నడుస్తుందా.. అంటే ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమే వస్తుంది. వాస్తవానికి ప్రభుత్వానికి అనుకూలంగా ఉద్యోగులు, పోలీసులు పని చేస్తారు. పార్టీలతో సంబంధం లేకుండా ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు వ్యవహరిస్తారు. కానీ ఏపీలో ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నేతలు చెప్పిందే వేదం అన్నట్లుగా వ్యవహరించారు కొందరు పోలీసులు. వయోభేదం లేకుండా, ఆడ, మగ అనే తేడా చూడకుండా.. ఇష్టం వచ్చినట్లు వ్యవహరించారు. ఇంకా చెప్పాలంటే రూల్స్ మొత్తం పక్కన పెట్టి.. తాడేపల్లి ప్యాలెస్ కంట్రోల్లో ఉన్నారు. అలా చేయబట్టే ఇప్పటికే ఐపీఎస్ అధికారులు కూడా సస్పెండ్ అయ్యారు. తాజాగా మరో మాజీ విషయంలో కూడా పోలీసులు ఇదే రకమైన ఉదాసీనత చూపిస్తూ విమర్శల పాలవుతున్నారు.
Also Read : రజనీకి స్టార్ట్ అయింది.. మరిది తర్వాత ఎవరు..?
వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ విషయంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిరణ్ను గుంటూరులో కోర్టుకు తరలిస్తున్న సమయంలో అతనిపై దాడికి యత్నించారు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్. పోలీసు వాహనానికి అడ్డుపడటంతో పాటు విధుల్లో పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. దీంతో గోరంట్ల మాధవ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైధీగా ఉన్న మాధవ్ను లోకేష్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో విచారణకు పోలీసులకు కోర్టు అనుమతి ఇచ్చింది. మాధవ్ను 2 రోజుల పాటు పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. ఇక్కడే పోలీసులు ఉదాసీనత బయట పడింది.
Also Read : నీటి నుంచి క్రికెట్ వరకు.. పాకిస్తాన్ కు మోడీ షాక్
రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న గోరంట్ల మాధవ్ను బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అక్కడి నుంచి గుంటూరు తరలించారు. సాయంత్రం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు తీసుకెళ్లారు. అవి పూర్తయ్యే సరికి సమయం కాస్త ముగిసింది. దీంతో మొదటి రోజు ఎలాంటి విచారణ జరిపించలేదు. ఇక రెండో రోజు కూడా మళ్లీ సాయంత్రానికే రాజమండ్రి సెంట్రల్ జైలుకు తీసుకురావాల్సి ఉంది. అంటే మధ్యాహ్నానికి మళ్లీ ఆసుపత్రికి తీసుకెళ్లి.. అక్కడ నుంచి నేరుగా సాయంత్రం 6 గంటల లోపు రాజమండ్రి తరలించాల్సి ఉంది. సాధారణంగా రిమాండ్ ఖైదీని పోలీసు కస్టడికి ఆదేశిస్తే.. ఉదయమే వచ్చి అదుపులోకి తీసుకుంటారు. అన్ని ఫార్మాలిటీస్ పూర్తైన తర్వాత ఉదయం 10 గంటల నుంచే విచారణ ప్రారంభిస్తారు. కానీ గోరంట్ల మాధవ్ విషయంలో మాత్రం పోలీసులు వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోర్టు ఇచ్చిన 2 రోజుల గడువును ప్రయాణానికే సరిపెట్టారు. గట్టిగా నాలుగు గంటలు మాత్రమే విచారిస్తే.. ఏం చెబుతారు అని ప్రశ్నిస్తున్నారు. గతంలో టీడీపీ నేతలు దేవినేని ఉమా, ధూళిపాళ్ల నరేంద్ర, కొల్లు రవీంద్ర వంటి సీనియర్ నేతల విషయంలో ఒకలా వ్యవహరించిన పోలీసులు ఇప్పుడు మాత్రం మాధవ్కు ఫేవర్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

