జనసేన ఎమ్మెల్సీ నాగబాబుకు వరుస షాకులు తగులుతున్నాయి. ఇందుకు ప్రధానంగా ఒకటే కారణం.. జనసేన పార్టీ ఆవిర్భావ సభలో ఆయన చెప్పిన ఒక్కటే మాట. అదే ఇప్పుడు టీడీపీ, జనసేన పార్టీల మధ్య అగాధం తీసుకువస్తోంది కూడా. పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలుపు కేవలం జనసేన పార్టీ కార్యకర్తలు, పిఠాపురం ప్రజల వల్లే జరిగిందన్నారు. అంతే తప్ప మరెవరైనా తమ వల్లే అనుకుంటే.. అది వారి ఖర్మ.. అంటూ వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలు పరోక్షంగా పిఠాపురం నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జ్, మాజీ ఎమ్మెల్యే వర్మ గురించే అన్నారనే విషయం అందరికీ ఇట్టే అర్థమైపోయింది. ఆ తర్వాత నుంచి పిఠాపురంలో రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి మారిపోయింది. ఇదే సమయంలో వర్మను కాదని నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి రావడంతో ఈ దూరం మరింత పెరిగింది.
Also Read : కొంప ముంచిన వాయిస్ మెసేజ్..!
జనసేన, బీజేపీ మధ్య పొత్తులో భాగంగా కొన్ని సీట్లను త్యాగం చేయాల్సిన పరిస్థితి టీడీపీలో తలెత్తింది. జనసేన పార్టీ కోరిన మేరకు పిఠాపురం నియోజకవర్గాన్ని టీడీపీ వదులుకుంది. అందుకు బలమైన కారణం.. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్వయంగా పిఠాపురం నుంచి బరిలో దిగేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఆ స్థానాన్ని టీడీపీ వదులుకుంది. అయితే నియోజకవర్గంలో బలమైన నేతగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వర్మకు చంద్రబాబు స్వయంగా హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తా అంటూ హామీ ఇచ్చారు చంద్రబాబు. దీంతో వర్మతో పాటు టీడీపీ మొత్తం పవన్ గెలుపు కోసమే పని చేసింది. ఫలితాలు విడుదలైన తర్వాత కూడా వర్మ వల్లే ఘన విజయం సాధ్యమైంది అంటూ పవన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కానీ జనసేన పార్టీ ఆవిర్భావ సభలో నాగబాబు చేసిన వ్యాఖ్యలు మాత్రం టీడీపీ నేతలకు ఏ మాత్రం మింగుడు పడలేదు.
Also Read : ఇక ఆ ఎమ్మెల్యే కథ ముగిసినట్లేనా..!
ఇక ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వర్మకు అవకాశం వస్తుందని అంతా భావించారు. కానీ 5 స్థానాల్లో జనసేన తరఫున నాగబాబుకు అవకాశం దక్కగా.. టీడీపీ తరఫున కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర, బీటీ నాయుడు పేర్లు వెలువడ్డాయి. దీంతో వర్మ అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే అధినేత నిర్ణయం మేరకు అంతా నడుచుకోవాలంటూ వర్మ వ్యాఖ్యానించడంతో.. అంతా సైలెంట్ అయ్యారు. తాజాగా ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత పిఠాపురం నియోజకవర్గంలో నాగబాబు మొదటిసారి అధికారికంగా పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు కూడా. అయితే ఎక్కడా కూడా వర్మ కనిపించటం లేదు. అలాగే ఈ కార్యక్రమాలకు టీడీపీ నేతలకు ఆహ్వానం కూడా లేదు. దీంతో టీడీపీ శ్రేణులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. చివరికి టీడీపీ బ్రాండ్ అన్న క్యాంటిన్ ప్రారంభానికి కూడా వర్మను ఆహ్వానించలేదు. దీనిపై ఇప్పటికే గుర్రుగా ఉన్న వర్మ అభిమానులు.. నాగబాబు రెండో రోజు పర్యటనను అడ్డుకున్నారు. కుమారపురంలో పర్యటించిన సందర్భంలో జై వర్మ, జై టీడీపీ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో జనసేన కార్యకర్తలు కూడా జై పవన్ అంటూ పోటీ నినాదాలు చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు వర్గాలను రెండు పార్టీల నేతలు సర్ది చెప్పి పంపేశారు. దీంతో ఈ వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది.

