తెలంగాణాలో బెట్టింగ్ యాప్స్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ప్రమోషన్స్ చేసే వారి విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే పలువురిపై కేసులు నమోదు చేసారు పోలీసులు. ఇక రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కీలక అడుగులు వేస్తోంది. బెట్టింగ్ యాప్స్ కేసులు సీఐడీకి బదిలీ చేసే యోచనలో ఉంది. హైదరాబాద్, సైబరాబాద్లో నమోదైన కేసులను విచారించే అవకాశం ఉంది. హైదరాబాద్ లో 11 మంది బెట్టింగ్ ప్రమోటర్లపై కేసు నమోదు చేసింది.
Also Read: ప్రత్యక్ష రాజకీయాల్లోకి భువనేశ్వరి..?
బెట్టింగ్ యాప్స్ కు ప్రచారం చేసిన.. 25 మంది సెలబ్రిటీలపై సైబరాబాద్లో కేసు నమోదు అయ్యాయి. యూట్యూబర్ల నుంచి సినీహీరోల వరకు కేసులు నమోదు చేసారు. ఇప్పటికే పలువురిని విచారించిన పోలీసులు.. మరికొందరు సినీ నటులను విచారించనున్నారు. తాజాగా అసెంబ్లీలో దీనిపై సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ హోంశాఖ, శాంతి భద్రత, ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్లపై మాజీ మంత్రి హరీష్ రావు లేవనెత్తిన అంశాలపై స్పందించిన రేవంత్ రెడ్డి.. తెలంగాణ ప్రభుత్వం 2021లో ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్లపై నిషేధం విధించిందని గుర్తుచేశారు రేవంత్.
Also Read: మంత్రి పదవి ఇస్తే సరి.. లేదంటే లేదంతే..!
కానీ.. సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఆ నిషేధం అమలు కావటం లేదన్నారు సిఎం. గత కొద్ది రోజులుగా ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన వారిపై కేసులు నమోదు చేసి విచారించినట్టు తెలిపిన ఆయన.. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసే వారిపై కేసులు పెట్టటం, విచారించటం వలన సమస్య తీరదని, ఈ బెట్టింగ్ యాప్లను నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకొవాలంటే చాలా మందిని ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ బెట్టింగ్ యాప్లపై విచారణ చేసేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని వివరించారు.

