సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునే విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ముందు వరుసలో ఉంటారు. మొదటిసారి సీఎం అయిన దగ్గర్నుంచి కూడా చంద్రబాబు నాయుడు టెక్నాలజీకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. ఇప్పుడు కూడా ఆయన టెక్నాలజీ విషయంలో ఇదే దూకుడు ప్రదర్శిస్తున్నారు. తాజాగా ప్రజలకు ప్రభుత్వాన్ని మరింత చేరువ చేసే విధంగా వాట్సాప్ ద్వారానే ప్రభుత్వ సేవలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొత్తం 161 సేవలను వాట్సాప్ ద్వారా ప్రజలకు అందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం.
Also Read : పెద్దిరెడ్డిపై పవన్ కళ్యాణ్ గురి
దీనిని ఉండవల్లిలోని ప్రజాదర్బార్లో మంత్రి నారా లోకేష్ ప్రారంభించనున్నారు. వేగంగా పౌర సేవలు అందించడంతో పాటుగా పారదర్శకత, జవాబుదారీ తనంలో భాగంగా ఈ వాట్సాప్ సేవలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తోంది. జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ వాట్సాప్ సేవలు అందిస్తారు. 2024 అక్టోబర్ 22వ తేదీన వాట్సప్ ద్వారా ఈ పౌర సేవలు అందించేందుకు మెటాతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. పౌరుల సమాచారం అలాగే సైబర్ నేరగాళ్లకు దొరక్కుండా సైబర్ సెక్యూరిటీ కల్పించేలా చర్యలు తీసుకోవాలని గతంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉన్నతాధికారులను ఆదేశించారు.
దేవాదాయ శాఖ, విద్యుత్ శాఖ, ఆర్టీసీ, రెవెన్యూ, అన్నా క్యాంటీన్, సీఎంఆర్ఎఫ్, మున్సిపల్ శాఖలోని సేవలను వాట్సాప్ ద్వారా అందిస్తారు. దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వం వాట్సాప్ సేవలను వాడుకోవడం గమనార్హం. ముఖ్యంగా దేవాదాయ శాఖలోని ప్రముఖ దేవాలయాల్లో దర్శనాల టికెట్లు, గదుల బుకింగ్ అలాగే విరాళాలకు సంబంధించినవి వాట్సప్ ద్వారానే పొందవచ్చు. అలాగే రెవెన్యూ శాఖలో దరఖాస్తులు, స్టేట్స్ ల్యాండ్ రికార్డులతో పాటుగా ఇతర ముఖ్యమైన సర్టిఫికెట్లు కూడా ఈ వాట్సాప్ ద్వారానే జారీ చేయనున్నారు.
Also Read : వైఎస్ ఫ్యామిలీ సేవలో కూటమి సర్కార్..
ఇక మున్సిపల్ శాఖలో ఆస్తి పన్నుల చెల్లింపులు, డెత్ అలాగే బర్త్ సర్టిఫికెట్లు జారీ, ట్రేడ్ లైసెన్సులు జారీ చేయాలని నిర్ణయించారు. ఇతర శాఖలలో యుటిలిటీ బిల్లులు, ఎలక్ట్రిసిటీ బిల్లులు తదితర సేవలను కూడా వాట్సాప్ పేమెంట్ వ్యవస్థ ద్వారా చెల్లింపులు చేసేందుకు అవకాశం కల్పించారు. ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరిగే ఇబ్బందులను తొలగించనున్నారు.

