వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వరుస షాకులు తగులుతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులు… ఇప్పుడు వరుసబెట్టి వెంటాడుతున్నాయి. పార్టీ నేతలను, కార్యకర్తలను చేసిన నిర్లక్ష్యానికి ఇప్పుడు భారీ మూల్యం చెల్లించుకుంటున్నారు జగన్. వై నాట్ 175 అని గొప్పలకు పోయిన వ్యక్తికి చివరికి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. దీంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న జగన్… ఏపీకి దూరంగా పూర్తిగా బెంగళూరు ప్యాలెస్కు పరిమితమయ్యారు. ఏదో చుట్టపు చూపులా ఏపీలోకి వస్తున్నారు తప్ప.. పార్టీ నేతలకు కూడా జగన్ దర్శనం కరువైంది. ఈ నేపథ్యంలో పార్టీకి ఒక్కొక్కరుగా సీనియర్ నేతలంతా గుడ్ బై చెప్పేసి వెళ్లిపోతున్నారు.
Also Read : ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే సెన్సేషనల్ కామెంట్స్
వైసీపీ మునిగిపోయే నావ అని తెలుగుదేశం పార్టీ నేతలు తొలి నుంచి చెబుతుంటే… రాజకీయ విమర్శల కింద అంతా కొట్టిపారేశారు. ఇక వసంత కృష్ణప్రసాద్ లాంటి వైసీపీ మాజీ నేతలు కూడా ఆరు నెలల్లో జగన్ దగ్గర ఎవరూ ఉండరని చెప్పడంతో నిజమే అని నమ్ముతున్నారు. ఇప్పటికే జగన్ బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు అత్యంత ఆప్తులు మోపిదేవి వెంకటరమణ, సామినేని ఉదయభాను, కిలారు రోశయ్య, అవంతి శ్రీనివాస్, గ్రంధి శ్రీనివాస్, ఆళ్ల నాని వంటి నేతలంతా జగన్కు బై బై చెప్పేశారు. తాజాగా జగన్ అక్రమాస్తుల కేసులో ఏ2 విజయసాయిరెడ్డి కూడా పార్టీకి, పదవికి రాజీనామా చేసేశారు. మరో ఎంపీ అయోధ్య రామిరెడ్డి సైతం రాజీనామా చేయనున్నారు. ఈ నేపథ్యంలో మరో మాజీ మంత్రి కూడా పార్టీ మారేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
Also Read : సూపర్ సిక్స్ పథకాలపై చంద్రబాబు సంచలన కామెంట్స్
మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. 2009 నుంచి వరుసగా 3 సార్లు గెలిచిన సురేష్ వైసీపీలో కీలక నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. వైసీపీ ప్రారంభ నేతల్లో సురేష్ ఒకరు. జగన్ కేబినెట్లో ఐదేళ్ల పాటు మంత్రిగా విద్యా, మునిసిపల్ వంటి కీలక శాఖలను నిర్వహించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో దగ్గరి బంధువు బాలినేనిని మంత్రిపదవి నుంచి తప్పించిన జగన్… కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో సురేష్కు మరో అవకాశం ఇచ్చారు. అలాగే కర్నూలు జుల్లా కోడుమూరు నియోజకవర్గం నుంచి సురేష్ సోదరుడు ఆదిమూలపు సతీష్కు ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చారు. అయితే తన సొంత నియోజకవర్గం యర్రగొండపాలెం నుంచి కాకుండా కొండపి నుంచి పోటీ చేయాలని జగన్ ఆదేశించడంతో ఆదిమూలపు సురేష్ కొంత అసహనానికి గురయ్యారు. అయితే ఆరోజు ఆధినేతకు ఎదురు చెప్పలేక సైలెంట్గా ఉన్నారు. అయితే ఇప్పుడు పార్టీలో జరుగుతున్న పరిణామాలు, సీనియర్ నేతలంతా ఒక్కొక్కరుగా పార్టీ మారుతున్న తీరును బేరీజు వేసుకున్న ఆదిమూలపు సురేష్… వైసీపీకి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయంపై తన కార్యకర్తలు, అభిమానులతో రహస్య సమావేశం నిర్వహించినట్లు సమాచారం. త్వరలోనే వైసీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరేందురు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.