ఇరాన్, అమెరికా దేశాల మధ్య ఉద్రిక్తతలు మరోసారి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇరాన్ ఎదుర్కొనేందుకు వాషింగ్టన్ వద్ద ఉన్న సాధారణ సైనిక ప్రత్యామ్నాయాలన్నీ అయిపోయాయని, ఇప్పుడు అమెరికాకు కేవలం అణుదాడి ఒక్కటే మిగిలి ఉందని టెహ్రాన్ డిప్యూటీ మేయర్ హమీద్ రెజా ఘోలామ్ జాదే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ అమెరికా అలాంటి సైనిక చర్యలకు దిగినా తాము పోరాటాన్ని ఆపబోమని, ధీటుగా ఎదుర్కొంటామని ఆయన తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
Also Read : ఏపీలో మన మిత్ర సరికొత్త చరిత్ర..!
అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల శోకసంద్రంలో ఉన్న ఇరాన్ ను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఖమేనీ అంత్యక్రియల ఊరేగింపును భగ్నం చేయడానికి లేదా లక్ష్యంగా చేసుకోవడానికి అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు వ్యూహాలు రచించాయని, అయితే అక్కడ గుమిగూడిన భారీ ప్రజా సమూహాన్ని, అంతర్జాతీయ అతిథుల ఉనికిని చూసి ఆ రెండు దేశాలు భయపడి వెనక్కి తగ్గాయని ఘోలామ్ జాదే ఆరోపించారు. భారీ ఎత్తున ప్రజలు తరలిరావడంతో అంత్యక్రియల వేడుకలు ఎటువంటి ఆటంకాలు లేకుండా చివరి దశకు చేరుకున్నాయని ఆయన స్పష్టం చేశారు.
ప్రపంచ నౌకాయాన రవాణాలో అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి ప్రస్తుతం తెరిచే ఉందని, అయితే రాబోయే 60 రోజుల తర్వాత అంతర్జాతీయ చట్టాలతో సంబంధం లేకుండా దీని గుండా వెళ్లే వాణిజ్య నౌకలపై తాము పన్ను విధిస్తామని ఇరాన్ ప్రకటించింది. ఇదే సమయంలో ఇరాన్, అమెరికాల మధ్య జరుగుతున్న పరోక్ష దౌత్య చర్చలు పూర్తిగా స్తంభించిపోయాయని, ఈ చర్చల్లో ఎలాంటి పురోగతి లేదనే విషయం తమతో పాటు అమెరికాకు కూడా తెలుసని ఇరాన్ చర్చల బృంద నిపుణుడైన ఘోలామ్ జాదే స్పష్టం చేసారు.
Also Read : రుద్రప్రయాగలో తారక్కు గురూజీ మంత్రోపదేశం..!
మరోవైపు, కేవలం మూడు వారాల క్రితమే ఇరు దేశాల మధ్య దాడులను నిలిపివేయడానికి ఒక అవగాహన ఒప్పందం కుదిరినప్పటికీ, హోర్ముజ్ జలసంధి పరిధిలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ వాణిజ్య నౌకలపైకి రెండు క్షిపణులను ప్రయోగించి రెండు నౌకలను పాక్షికంగా ధ్వంసం చేయడం గమనార్హం. ఖమేనీ మరణం తర్వాత ఈ వ్యూహాత్మక జలసంధిపై ఇరాన్ పట్టు బిగిస్తూ, రాబోయే రోజుల్లో రవాణా రుసుములను శాశ్వతం చేసేందుకు ప్రయత్నిస్తుండటంతో గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి.

