ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ అదృశ్యం, లాకప్ డెత్ ఆరోపణల కేసులో విచారణ కీలక దశకు చేరుకుంది. పరారీలో ఉంటూ ఎట్టకేలకు అరెస్టయిన కృష్ణలంక మాజీ సీఐ ఎస్.ఎస్.వి.వి. నాగరాజును విజయవాడలోని పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో సిట్ బృందం సుదీర్ఘంగా విచారిస్తోంది. సిట్ చీఫ్ రవిప్రకాశ్ నేతృత్వంలో అధికారులు నాగరాజును తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. సాయికృష్ణ అదృశ్యం వెనుక అసలు ఏం జరిగింది? పోలీస్ స్టేషన్లో థర్డ్ డిగ్రీ ఉపయోగించారా? శవాన్ని ఎక్కడ దాచారు? అనే కోణంలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
Also Read : హైస్పీడ్గా రైలు నెట్వర్క్..!
అయితే, సిట్ అధికారుల ప్రశ్నలకు సీఐ నాగరాజు నోరు మెదపకుండా మౌనంగా ఉన్నట్లు సమాచారం. తానే చేసాను అని గ్యారెంటీ ఏంటీ అంటూ కూడా సిఐ ప్రశ్నించినట్లు సమాచారం. మరోవైపు విచారణ ప్రక్రియ ముగియడంతో, కాసేపట్లో నాగరాజును వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు సిట్ అధికారులు ఏర్పాట్లు చేశారు. వైద్య పరీక్షలు పూర్తయిన వెంటనే, మధ్యాహ్నంలోపు ఆయన్ను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. నాగరాజు అరెస్ట్ నేపథ్యంలో విజయవాడ కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
Also Read : రేవంత్ సర్కార్ దెబ్బకు దిగి వచ్చిన ఎస్బీఐ..!
ఆయన అనుచరులు, బంధువులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకుని ర్యాలీగా రావడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అదనపు బలగాలను రంగంలోకి దించారు. సాయికృష్ణను మే 9న టాస్క్ ఫోర్స్ పోలీసులు కృష్ణలంక పీఎస్ కు అప్పగించినట్లు రికార్డులు చెబుతున్నాయి. అయితే ఆ తర్వాత అతడు కనిపించకుండా పోవడం, లాకప్ డెత్ గా మారడంతో.. గుర్తుతెలియని శవంగా చూపి రహస్యంగా దహనం చేశారనే కోణంలో స్మశానవాటిక సిబ్బందిని కూడా సిట్ ప్రశ్నించింది. మే 23 నుంచి మే 26 మధ్య జరిగిన అనాథ శవాల దహన సంస్కారాల రికార్డులను సిట్ ఇప్పటికే స్వాధీనం చేసుకుంది.

