ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ జవాబు పత్రాల మూల్యాంకనంలో జరిగిన భారీ అక్రమాలపై సిట్ తన తుది నివేదికను రాష్ట్ర హైకోర్టుకు సమర్పించింది. సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలోని సిట్ జరిపిన కీలక విచారణలో నివ్వెరపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. గ్రూప్-1 జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియలో ఎలాంటి పారదర్శకత, గోప్యత, విశ్వాసనీయత పాటించలేదని, నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కారని సిట్ తన నివేదికలో స్పష్టం చేసింది.
Also Read : ఎన్నారైల అండతో తెలుగుదేశం జెండా రెపరెపలు
ఈ కేసులో సిట్ జరిపిన ఫోరెన్సిక్ పరీక్షల్లో అక్రమాలు స్పష్టంగా నిర్ధారణ అయ్యాయి. సుమారు 736 మంది గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష రికార్డులను పరిశీలించగా, అందులో 718 మంది ఓఎంఆర్ వాల్యుయేషన్ స్లిప్పులలో భారీగా దిద్దుబాట్లు మరియు మార్పులు జరిగినట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా, లంచాలు తీసుకుని కొంతమంది అభ్యర్థుల మార్కులను అక్రమంగా పెంచడానికి ఏపీపీఎస్సీ అధికారులే స్వయంగా ఒరిజినల్ పేపర్లను ఒక ప్రైవేట్ రిసార్ట్కు తరలించి, అక్కడ అనధికారిక ప్రైవేట్ వ్యక్తులతో మూల్యాంకనం చేయించారని సిట్ ఆధారాలతో సహా నిరూపించింది.
Also Read : బొత్స మేనల్లుడు చిన్న శ్రీను చేరికతో టిడిపి కి లాభమా లేక నష్టమా?
ఈ ప్రక్రియలో ఎగ్జామినర్లు, క్యాంప్ ఆఫీసర్ల సంతకాలను కూడా ఫోర్జరీ చేసినట్లు తేలింది. మరీ దారుణంగా, గ్రూప్-1 లాంటి అత్యున్నత స్థాయి ఉద్యోగాల పేపర్లను దిద్దడానికి డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఎలక్ట్రీషియన్లు, సెక్యూరిటీ గార్డుల వంటి అర్హత లేని అనధికారిక వ్యక్తులను ఉపయోగించారని నివేదిక ద్వారా బహిర్గతమైంది. విజయవాడలో అధికారికంగా మ్యాన్యువల్ ఎవాల్యూషన్ ప్రారంభం కావడానికి ముందే 57 మంది ఎగ్జామినర్ల రహస్య వివరాలు లీక్ అయ్యాయని సిట్ పేర్కొంది. అర్హత లేని ప్రైవేట్ సంస్థలకు రూ.2.5 కోట్లకు పైగా నిధులను అక్రమంగా చెల్లించినట్లు కూడా అధికారులు గుర్తించారు. పర్యవేక్షణ లోపాలు, గోప్యత ఉల్లంఘనలపై సిట్ సమర్పించిన ఈ తుది నివేదిక ఆధారంగా హైకోర్టు తీర్పుపై ఇప్పుడు అందరి దృష్టి నిలిచింది.

