లీప్ యాప్.. లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్.. ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పాఠశాలల నిర్వహణను ఒకే డిజిటల్ వేదికపైకి తీసుకురావడానికి ఈ యాప్ను రూపొందించింది. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో లీప్ యాప్ వ్యవహారం ఉపాధ్యాయుల్లో తీవ్ర అసంతృప్తికి కారణమవుతోంది. సాంకేతిక సమస్యలతో యాప్ సక్రమంగా పనిచేయని పరిస్థితుల్లోనూ, పనులు పెండింగ్లో ఉన్నాయంటూ ఉపాధ్యాయుల పేర్లను జాబితాల రూపంలో వారి బృందాల్లో బహిరంగంగా ప్రదర్శించడంపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. యాప్లో సాంకేతిక సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత ఎవరిదో గుర్తించకుండా ఉపాధ్యాయులపై బాధ్యతను మోపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.
Also Read : క్షణాల్లో మాట మార్చేసిన వైసీపీ.. ఏందయ్యా ఇది..!
పెండింగ్ జాబితాలను బహిరంగంగా ప్రదర్శించడం అధికారిక పర్యవేక్షణలో భాగమే అయితే అదే విధానం బాధ్యత వహిస్తున్న ప్రతి ఒక్కరికీ సమానంగా వర్తించాల్సిందేనని ఉపాధ్యాయులు స్పష్టం చేస్తున్నారు. ఉదయం తొమ్మిది గంటల తర్వాత హాజరు నమోదు చేయని ఉపాధ్యాయుల జాబితాలను బహిరంగంగా ప్రదర్శిస్తున్నప్పుడు, పాఠశాలల్లో మరుగుదొడ్ల తనిఖీలు, నివేదికలు పూర్తిచేయని వారి వివరాలను చూపిస్తున్నప్పుడు, మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన తనిఖీలు, నామినేషన్లు, నివేదికలు పూర్తికాని వారి పేర్లను పెండింగ్ జాబితాల్లో పేర్కొంటున్నప్పుడు.. అదే విధానాన్ని యాప్ నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలు ఉన్న అధికారుల విషయంలో ఎందుకు పాటించరని నిలదీస్తున్నారు.
లీప్ యాప్లో వివరాలు నమోదు కావడం లేదా నవీకరణలు పూర్తికాకపోవడానికి కారణం ఉపాధ్యాయుడి నిర్లక్ష్యమా, సాంకేతిక సమస్యా, లేక పర్యవేక్షణ లోపమా అన్నది ముందుగా తేల్చాలని వారు కోరుతున్నారు. ఎక్కడ పని పెండింగ్లో ఉందో మాత్రమే కాకుండా.. ఎవరి పరిధిలో అది పెండింగ్లో ఉందో కూడా స్పష్టంగా వెల్లడించాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఉపాధ్యాయుల పేర్లను మాత్రం బహిరంగంగా ప్రదర్శించి, సంబంధిత అధికారుల బాధ్యతలను మాత్రం ప్రశ్నించకపోవడం ఏ విధమైన సమానత్వమని వారు ప్రశ్నిస్తున్నారు. ఉపాధ్యాయులకు ఒక ప్రమాణం.. అధికారులకు మరో ప్రమాణమా..? అని నిలదీస్తున్నారు.
Also Read : స్థానిక ఎన్నికలు.. ‘మినీ పొలిటికల్ వార్’..!
సాంకేతిక లోపం కారణంగా పని పూర్తికాకపోయినా దానికి ఉపాధ్యాయుడినే బాధ్యుడిని చేయడం సరికాదంటున్నారు. ఉపాధ్యాయుల పేర్లను పెండింగ్ జాబితాల రూపంలో బహిరంగంగా ప్రదర్శించడం వారి గౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉండకూడదంటున్నారు. పర్యవేక్షణ పేరుతో బాధ్యతను నిర్ణయించాలనుకుంటే అందరికీ ఒకే విధానం ఉండాలని స్పష్టం చేస్తున్నారు. పెండింగ్ జాబితా కావాలంటే అందరిదీ ఉండాలి.. బాధ్యత కావాలంటే అందరిదీ ఉండాలి.. పారదర్శకత కావాలంటే అందరికీ సమానంగా ఉండాలి అని డిమాండ్ చేస్తున్నారు. ముందుగా లీప్ యాప్లోని సాంకేతిక సమస్యలను పరిష్కరించి, అనంతరం పనితీరుపై బాధ్యతను నిర్ణయించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. యాప్ సక్రమంగా పనిచేయని లోపానికి ఉపాధ్యాయులను బలి పశువులను చేయడం మానుకోవాలని, సాంకేతిక సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు ఉపాధ్యాయుల గౌరవాన్ని కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు.

