కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథకు సంబంధించిన వివాదం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ కేసులో విచారణను తక్షణమే వేగవంతం చేయాలని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీ సీవీ ఆనంద్ ను సీఎం ఆదేశించారు. సచివాలయంలో డీజీపీతో భేటీ అయిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు.
Also Read : ఢిల్లీలో బిజీ బిజీగా చంద్రబాబు..!
బాధితురాలు ఈ నెల 8వ తేదీనే పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ, ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని డీజీపీని నిలదీశారు. బాధితులు ఫిర్యాదు చేసినప్పుడు రాజకీయ ఒత్తిళ్లకు తావులేకుండా పోలీసులు తక్షణమే స్పందించాలని ఈ సందర్భంగా సీఎం స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ప్రశ్నలకు డీజీపీ సీవీ ఆనంద్ వివరణ ఇస్తూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన ఉన్నందున, పోలీసు యంత్రాంగం మొత్తం.. గత కొన్ని రోజులుగా.. భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమైందని వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.
Also Read : రోజా అరెస్టుకు ఐఏఎస్ బ్రేకులు..!
ఈ కారణం చేతనే కేసు విచారణలో స్వల్ప జాప్యం జరిగిందని ఆయన ముఖ్యమంత్రికి డీజీపీ వివరించారు. ప్రస్తుతం భద్రతా విధులు ముగియడంతో పూర్తిస్థాయిలో విచారణ చేపడతామని హామీ ఇచ్చారు. బండి భగీరథపై ఓ బాధితురాలు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే ఈ కేసు వివరాలను గోప్యంగా ఉంచిన పోలీసులు, సీఎం జోక్యంతో ఇప్పుడు విచారణను వేగవంతం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతల విషయంలో ఎవరినీ ఉపేక్షించేది లేదని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని ప్రభుత్వం ఈ సందర్భంగా సంకేతాలు పంపింది.

