దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన నీట్-యూజీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో కీలక వ్యక్తిని మహారాష్ట్రలో అదుపులోకి తీసుకున్నారు. ఈ పరీక్షల అవకతవకలపై దర్యాప్తు ముమ్మరం చేసిన నాసిక్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు.. లీకేజీ వ్యవహారంలో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న శుభం కైర్నాన్ అనే 30 ఏళ్ళ వ్యక్తిని అరెస్ట్ చేసారు. పోలీసుల నిఘా నుండి తప్పించుకోవడానికి నిందితుడు తన రూపాన్ని, హెయిర్ స్టైల్ ను పూర్తిగా మార్చుకున్నప్పటికీ, సాంకేతిక ఆధారాల సహాయంతో అధికారులు అతడిని నాసిక్ లోని ఇందిరానగర్ పరిసరాల్లో అదుపులోకి తీసుకున్నారు.
Also Read : అర్ధరాత్రి హైడ్రామా.. అనుకున్నది సాధించిన చింతమనేని..!
ఈ వ్యవహారంపై ప్రాథమిక విచారణ పూర్తికాగానే, తదుపరి లోతైన దర్యాప్తు కోసం నాసిక్ పోలీసులు నిందితుడిని సీబీఐకి అప్పగించారు. ఈ అరెస్ట్ అనంతరం లీకేజీ నెట్వర్క్ కు సంబంధించిన మరిన్ని లింకులను బయటకు తీసేందుకు మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో సీబీఐ బృందాలు ఏకకాలంలో ముమ్మర సోదాలు, తనిఖీలు నిర్వహిస్తున్నాయి. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. ఈ నీట్ ప్రశ్న పత్రాలు ముద్రితమైన నాసిక్ లోని ఒక రహస్య ప్రింటింగ్ ప్రెస్ నుంచే ఒరిజినల్ పేపర్ ముందే బయటకు వచ్చినట్లు గట్టి ఆధారాలు లభించాయి.
Also Read : ప్రసంగించడానికి వెళ్లి పెట్టుబడులతో వచ్చిన బాబు
ఆ ప్రింటింగ్ ప్రెస్ నుంచే నిందితుడు శుభం కైర్నాన్ ఫిజికల్ కాపీని సేకరించి, దానిని పీడీఎఫ్ రూపంలోకి మార్చినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఈ లీకైన పత్రంలోని ప్రశ్నలు అసలు పరీక్షలోని దాదాపు 120 ప్రశ్నలతో హూబహూ మ్యాచ్ అయినట్లు అధికారులు స్పష్టం చేశారు. అక్కడి నుంచి వ్యాపించిన ఈ ప్రశ్నపత్రం నెట్వర్క్.. వయా టెలిగ్రామ్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా హర్యానాలోని గురుగ్రామ్ కు చెందిన ఒక ప్రముఖ వైద్యుడికి చేరినట్లు పోలీసులు వెల్లడించారు. ఆ తర్వాత దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు, బ్రోకర్ల సహాయంతో కోట్లాది రూపాయల చేతులు మారి విద్యార్థులకు చేరినట్లు దర్యాప్తులో తేలింది. ప్రస్తుతం సీబీఐ అధికారులు ఈ మెడికల్ మాఫియా నెట్వర్క్ వెనుక ఉన్న పెద్ద తలకాయలను పట్టుకునేందుకు విచారణను మరింత తీవ్రతరం చేశారు.

