ఏపీ రాజకీయాల్లో పసుపు జెండాను వీడి బోండా ఉమామహేశ్వరరావు త్వరలోనే కొత్త దారి చూసుకోబోతున్నారనే ప్రచారం జోరందుకుంది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యేగా ఉన్న ఆయన, తాజాగా చేసిన వ్యాఖ్యలు సొంత పార్టీలోనే తీవ్ర కలకలం రేపుతున్నాయి. ప్రభుత్వంపై అసంతృప్తి స్వరంతో ఆయన మాట్లాడిన తీరు చూస్తుంటే, పసుపు జెండాను వీడటానికి మానసికంగా సిద్ధమయ్యారనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో కాపు సామాజిక వర్గంలో తీవ్రమైన అలజడి మొదలైందంటూ సంచలన కామెంట్స్ చేసారు.
Also Read : భారత్ కు షాక్ ఇచ్చిన ట్రంప్..!
దీనిపై కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉందని బోండా ఉమా డిమాండ్ చేశారు. కాపుల డిమాండ్లను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని గుర్తు చేస్తూ.. ఆర్థిక నిధుల కేటాయింపులోనూ, రాజకీయ పదవుల పంపకాల్లోనూ కాపులకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన గట్టిగా పట్టుబట్టారు. సొంత పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ, కాపుల హక్కుల కోసం ఆయన ఓపెన్ వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తూ.. 2019లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయానికి కాపు సామాజిక వర్గం దూరం కావడమే ప్రధాన కారణమని బోండా ఉమా అభిప్రాయపడ్డారు.
Also Read : సీమకు మరో బంపర్ ఆఫర్..!
నాడు ముద్రగడ పద్మనాభం నేతృత్వంలో జరిగిన కాపు రిజర్వేషన్ల ఉద్యమం ఎన్నికలపై ఎంతటి తీవ్ర ప్రభావాన్ని చూపిందో గుర్తు చేస్తూ.. మళ్లీ అలాంటి తప్పు జరగకూడదనే ఉద్దేశంతోనే తాను మాట్లాడుతున్నట్లు చెప్పారు. ఒక రకంగా ఈ ప్రస్తావన ద్వారా చంద్రబాబుకు ఆయన పరోక్షంగా గట్టి హెచ్చరిక పంపారనే చర్చ నడుస్తోంది. ఈ మొత్తం ఎపిసోడ్లో అత్యంత సంచలనాత్మక ట్విస్ట్ ఏంటంటే.. త్వరలోనే ముద్రగడ పద్మనాభం విగ్రహావిష్కరణను తానే స్వయంగా చేపట్టబోతున్నట్లు బోండా ఉమా ప్రకటించడం. గతంలో టీడీపీ హయాంలో ముద్రగడను గృహనిర్బంధం చేయడం కాపుల ఆగ్రహానికి కారణమైంది. అలాంటి ముద్రగడ విగ్రహాన్ని ప్రతిష్టించడానికి బోండా ఉమా ముందుకు రావడం అంటే అది నేరుగా టీడీపీ అధిష్టానంపై తిరుగుబాటు చేయడమేనని, ఆ వేదిక నుంచే ఆయన తన భవిష్యత్తు రాజకీయ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

