ఐపీఎల్ 2026 సీజన్ లో భాగంగా పంజాబ్ కింగ్స్ తో జరగబోయే తదుపరి మ్యాచ్ కు ముందు ముంబై ఇండియన్స్ లో పరిణామాలు ఆసక్తిని రేపుతున్నాయి. జట్టుతో కెప్టెన్ హార్దిక్ కు విభేదాలు ఉన్నాయనే వార్తల నేపధ్యంలో.. తాజాగా హార్దిక్ నెట్స్ లో ఒంటరిగా శ్రమిస్తూ కనిపించాడు. వెన్నునొప్పి కారణంగా ఆయన ముంబై ఇండియన్స్ ఆడిన గత రెండు మ్యాచ్ లకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే, గురువారం ధర్మశాలలో పంజాబ్ తో జరగబోయే మ్యాచ్ కంటే ముందే అతను మైదానంలో ఒంటరిగా తీవ్రంగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించడం విశేషం.
Also Read : బ్రేకింగ్: నాగార్జున యాదవ్ కు మ్యూజిక్ స్టార్ట్..!
తాను పూర్తి స్థాయిలో కోలుకున్నానని, జట్టు తరఫున కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేందుకు హార్దిక్ పాండ్యా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఈ ప్రాక్టీస్ వీడియోను షేర్ చేసాడు. ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ఆయన పునరాగమనంపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ, ఈ నెట్ ప్రాక్టీస్ విజువల్స్ చూస్తే అతను తుది జట్టులోకి రావడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. మే 10న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ సమయానికే హార్దిక్ జట్టుతో చేరినప్పటికీ, అప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించకపోవడంతో ప్లేయింగ్ ఎలెవన్ లో చోటు దక్కించుకోలేకపోయాడు.
Also Read : రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాకు నైజాం ఎగ్జిబిటర్ల ఊహించని షాక్
ముంబై ఇండియన్స్ జట్టు మే 10న ఆర్సీబీ చేతిలో ఆఖరి బంతికి ఓటమిపాలై ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుండి అధికారికంగా నిష్క్రమించిన సంగతి తెలిసిందే. ముంబై ప్రయాణం దాదాపు ముగిసినప్పటికీ, మిగిలిన మూడు మ్యాచ్ లలో యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని, వారు ఒత్తిడిని ఎలా తట్టుకుంటారో పరీక్షించాలని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఫ్రాంచైజీకి సూచించాడు. అయితే, ఈ మ్యాచ్ ముంబై జట్టుకు నామమాత్రమే అయినప్పటికీ, ప్రత్యర్థి అయిన పంజాబ్ కింగ్స్ జట్టుకు మాత్రం అత్యంత కీలకంగా మారింది. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ వరుసగా నాలుగు ఓటములతో తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. పాయింట్ల పట్టికలో టాప్-2 స్థానాన్ని దక్కించుకోవాలంటే ముంబైపై పంజాబ్ ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది.

