గత రెండు నెలలుగా వర్షాలు లేక ఇబ్బంది పడుతున్న రైతన్నలకు గోదావరి నది శుభవార్త అందించింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నీటిమట్టం వేగంగా పెరుగుతూ 43 అడుగులకు చేరుకోవడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ, పరీవాహక ప్రాంతాల్లో పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. భద్రాచలం వద్ద వరద ప్రవాహం ఇలాగే కొనసాగితే, రాబోయే కొన్ని గంటల్లో రెండో ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేసే అవకాశం ఉంది.
Also Read : అడ్డంగా దొరికిపోయిన కేటిఆర్..?
గోదావరికి వస్తున్న ఈ భారీ వరద ప్రవాహం ఏపీలోని కృష్ణా డెల్టా రైతులకు పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇటీవల గోదావరిలో నీటి లభ్యత తగ్గడంతో పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా నదికి నీటి విడుదలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు భద్రాచలం వద్ద వరద నీరు పోటెత్తుతుండటం, ప్రవాహం ధవళేశ్వరం బ్యారేజ్ వైపు వేగంగా దూసుకుపోతుండటంతో పట్టిసీమ పంపులను మళ్లీ ఆన్ చేసేందుకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడ్డాయి.
Also Read : కేవలం వ్యాయామంతోనే ప్రీడయాబెటిస్ కు చెక్ పెట్టవచ్చా..?
ఈ వరద ప్రవాహంతో పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు మళ్లించేందుకు ఏపీ జలవనరుల శాఖ అధికారులు త్వరలోనే కసరత్తు ప్రారంభించనున్నారు. కుడి కాలువ ద్వారా నీటిని విడుదల చేస్తే ప్రకాశం బ్యారేజ్ పరిధిలోని కృష్ణా డెల్టా పంటలకు సాగునీటి ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయి. గోదావరి వరద అటు భద్రాచలం ఏజెన్సీని అప్రమత్తం చేసినప్పటికీ, ఇటు కృష్ణా బేసిన్ రైతుల్లో మాత్రం కొత్త ఆశలు చిగురింపజేస్తోంది. అటు శ్రీశైలం జలాశయానికి కూడా వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది.

