తెలంగాణలో తీవ్ర సంచలనం సృష్టిస్తున్న ఫార్ములా ఈ కార్ రేస్ కేసు ముదురుతోంది. ఈ వ్యవహారంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక కోర్టులో 77 పేజీల సుదీర్ఘ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ కేసు విచారణ నిమిత్తం కేటీఆర్ నేడు నాంపల్లి ప్రత్యేక ఏసీబీ కోర్టుకు హాజరు అయ్యారు. ఈ నేపథ్యంలో నాంపల్లి కోర్టు పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కోర్టు విచారణపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
Also Read : వన్ ఆఫీసర్, వన్ కార్.. ప్రభుత్వ వాహనాలకు కేంద్రం బ్రేక్..!
నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కి ఈ రేస్ నిర్వహించారని ఏసీబీ తన ఛార్జ్ షీట్ లో స్పష్టం చేసింది. ఈ అంతర్జాతీయ ఈవెంట్ నిర్వహణకు సంబంధించి కనీసం మంత్రివర్గం ఆమోదం కూడా తీసుకోలేదని అధికారులు పేర్కొన్నారు. ఆర్థిక శాఖ, న్యాయ శాఖల నుండి ఎలాంటి ముందస్తు అనుమతులు మరియు క్లియరెన్స్లు లేకుండానే ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు. కేటీఆర్ తన అధికార పరిధిని దాటి, అధికారులపై ఒత్తిడి తెచ్చి లెటర్ ఆఫ్ ఇంటెంట్ పై సంతకాలు చేయించారని ఏసీబీ కోర్టుకు సమర్పించిన నివేదికలో స్పష్టంగా పొందుపరిచింది.
Also Read : ఏపీలో పోలీసు వ్యవస్థ పని చేస్తుందా..?
ఈ స్కామ్ లో భారీగా ప్రజాధనం దుర్వినియోగం అయిందని, క్విడ్ ప్రో కో కోణాలు ఉన్నాయని ఏసీబీ లెక్కలతో సహా వివరించింది. రేస్ ఈవెంట్ ఫీజుల కోసం హెచ్ఎండీఏ ఖజానా నుండి రూ. 75.88 కోట్ల నిధులను బ్రిటన్ కు చెందిన ఎఫ్ఈవో సంస్థకు చట్టవిరుద్ధంగా మళ్లించారని పేర్కొంది. అంతేకాకుండా, ట్రాక్ల నిర్మాణం, రోడ్ల విస్తరణ పేరిట ప్రభుత్వంపై రూ. 600 కోట్ల భారీ ఆర్థిక భారం మోపి, ప్రజాధనాన్ని వృథా చేశారని ఆరోపించింది. ఈ ప్రాజెక్ట్ ను ‘ఏస్ నెక్స్ట్జెన్’ సంస్థకు అప్పగించినందుకు ప్రతిఫలంగా బీఆర్ఎస్ పార్టీకి రూ. 44 కోట్ల విరాళాలు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో అందాయని, ఇది ముమ్మాటికీ క్విడ్ ప్రో కో కిందకే వస్తుందని ఏసీబీ సంచలన ఆధారాలను కోర్టు ముందు ఉంచింది.

