తమిళనాడు శాసనసభలో సిఎం విజయ్ చేసిన ప్రసంగం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. పార్టీ స్థాపించి, ఇటీవలే అధికారంలోకి వచ్చిన ఆయన, అసెంబ్లీ వేదికగా విపక్షాల విమర్శలపై ఘాటుగా స్పందించారు. తాము అధికార పీఠం ఎక్కి కొన్ని రోజులు మాత్రమే అవుతోందని, అప్పుడే తమ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలు చేయడం సరికాదని విజయ్ హితవు పలికారు. తమ ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని, తాము తీసుకురాబోయే వ్యవస్థాగత మార్పులను కళ్లారా చూపిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Also Read : సాయికృష్ణ అదృశ్యం కేసులో బిగ్ ట్విస్ట్..!
తన రాజకీయ ప్రస్థానాన్ని, పార్టీని తక్కువ చేసి మాట్లాడిన వారికి సీఎం విజయ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ‘కేవలం ఒక నటుడి పార్టీ’ అని తమను ఎగతాళి చేశారని, ఎన్నో కుట్రలు, ఆంక్షలను అధిగమించి ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించామని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజుల్లోనే విమర్శలు గుప్పించడం విపక్షాల తొందరపాటుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని, పాలనలో సరికొత్త మార్పు ఖాయమని స్పష్టం చేశారు.
Also Read : ఉదయం యాసిడ్ రిఫ్లక్స్ వేధిస్తోందా..? పరిష్కారం ఇదే..!
ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వంతో సంబంధాలు మరియు తమ పార్టీ సిద్ధాంతాలపై సీఎం విజయ్ అత్యంత కీలకమైన స్పష్టతనిచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వంతో తాము ఎల్లప్పుడూ సయోధ్యగానే ఉంటామని ప్రకటించారు. అయితే, సిద్ధాంతపరంగా మాత్రం తాము బీజేపిని పూర్తిగా వ్యతిరేకిస్తామని తేల్చి చెప్పారు. రాష్ట్ర హక్కుల విషయంలో రాజీ పడకుండానే, అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పనిచేస్తామనే సంకేతాన్ని విజయ్ ఇచ్చారు. సభ్యుల నినాదాలు, విపక్షాల అరుపుల మధ్యే సాగిన ఈ అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి విజయ్ ప్రసంగం ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తించింది.

