ఉత్తర కొరియా అధికార పక్షం వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా ప్లీనరీ సమావేశంలో ఆ దేశ అధినేత కిమ్ జోంగ్ ఉన్ అంతర్జాతీయ సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసే అత్యంత కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి, శత్రుదేశాల దాడులను తిప్పికొట్టడానికి అణ్వాయుధాల విస్తరణే ఏకైక మార్గమని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచంలో మరే దేశానికి లేనంతగా అణ్వాయుధ రంగంలో ప్రపంచాన్ని మించిపోవాలనే సరికొత్త లక్ష్యాన్ని తమ సైన్యానికి, అధికారులకు కిమ్ జోంగ్ ఉన్ దిశా నిర్దేశం చేశారు.
Also Read : భారత్ కు పాక్ వార్నింగ్.. అదే జరిగితే యుద్దమే..!
మూడు రోజుల పాటు సాగిన ఈ కేంద్ర కమిటీ సమావేశంలో అమెరికా, దక్షిణ కొరియా కూటమిపై కిమ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలను పెంచుతున్న శత్రువుల కుట్రలను ఎదుర్కొనేందుకు దేశ అణుశక్తిని గణనీయంగా పెంచాలని, సరికొత్త అణు సాంకేతికతతో మరింత వేగంగా అస్త్రాలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ప్రపంచంలో నెలకొన్న అస్థిరమైన రాజకీయ, సైనిక పరిస్థితుల నేపథ్యంలో ఉత్తర కొరియా ఒక అగ్రగామి అణు దేశంగా తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ ప్లీనరీ ఏకగ్రీవంగా తీర్మానించింది.
Also Read : బ్రిటన్ ప్రధానులకు శాపం.. పదేళ్ళలో ఆరవ ప్రధాని..!
ఇదే వేదికపై నుంచి రక్షణ రంగాన్ని మరింత పటిష్టం చేసేందుకు కిమ్ జోంగ్ ఉన్ పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా 10 వేల టన్నుల సామర్థ్యం గల వ్యూహాత్మక గైడెడ్ మిస్సైల్ క్రూయిజర్ నౌక నిర్మాణాన్ని వేగవంతం చేయాలని, దేశ దక్షిణ సరిహద్దుల్లో రక్షణను మరింత కట్టుదిట్టం చేయాలని పిలుపునిచ్చారు. శత్రు దేశాల దూకుడుకు అడ్డుకట్ట వేస్తూ, ఎలాంటి యుద్ధానికైనా సన్నద్ధంగా ఉండేలా దేశ రక్షణ సంపత్తిని నిరంతరం పెంచుకుంటూనే పోతామని కిమ్ హెచ్చరించారు.

