ఏపీలో మెట్రో రైలు ప్రాజెక్టు పనులు ఊపందుకున్నాయి. విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టులు కీలక దశకు చేరుకున్నాయి. రెండు ప్రాజెక్టులకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక.. డీపీఆర్లను కేంద్ర ప్రభుత్వం ఆర్థిక మదింపునకు సంబంధిత డివిజనకు పంపింది. రెండు నగరాల్లో కలిపి తొలిదశలో రూ.21,616 కోట్ల భారీ పెట్టుబడితో 84.63 కిలోమీటర్ల మేర మెట్రో నెట్వర్క్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. విశాఖలో స్టీల్ ప్లాంట్ నుంచి నగరంలోని కీలక ప్రాంతాలకు మెట్రో అనుసంధానంతో ఉద్యోగులు, ప్రజల రాకపోకలు సులభతరం కానున్నాయి.
Also Read : ఏపి పోలీసుల పై మంత్రి భరత్ ఘాటు వ్యాఖ్యలు
విజయవాడలో గన్నవరం నుంచి కారిడార్ ఏర్పాటుతో విమానాశ్రయం, నగరం ప్రధాన నివాస, వాణిజ్య ప్రాంతాల మధ్య ప్రజా రవాణా అనుసంధానం బలోపేతం కానుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు ప్రాజెక్టుల డీపీఆర్లను కేంద్రానికి పంపారు. వీటిపై కొన్ని అభ్యంతరాలు, సూచనల తర్వాత ఆర్థిక మదింపునకు కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. సంయుక్త భాగస్వామ్య విధానం.. జేవీ మోడల్లో ఈ రెండు ప్రాజెక్టులూ చేపట్టనున్నారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం 20 శాతం, కేంద్ర ప్రభుత్వం 20 శాతం చొప్పున నిధులు సమకూర్చనున్నాయి. మిగిలిన 60 శాతం నిధులు ఆర్థిక సంస్థల నుంచి సేకరించనున్నారు. కొన్ని విదేశీ బ్యాంకులు రుణం సమకూర్చేందుకు ఆసక్తిగా ఉన్నాయి.
విశాఖ ఇప్పటికే పారిశ్రామిక, ఐటీ, పర్యాటక కేంద్రంగా ఎదుగుతోంది. విజయవాడ వాణిజ్య, రవాణా, పరిపాలనా కేంద్రంగా కీలకంగా ఉంది. ఈ రెండు నగరాల్లో మెట్రో రైళ్లు అందుబాటులోకి వస్తే రోడ్డు రవాణాపై ఒత్తిడి తగ్గడంతో పాటు నగర ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోనున్నాయి. నగర అభివృద్ధి ఒకే ప్రాంతంలో కేంద్రీకృతం కాకుండా మెట్రో కారిడార్ల వెంట కొత్త వృద్ధి కేంద్రాలు ఏర్పడే అవకాశం ఉంది. మెట్రో రైల్ ప్రాజెక్టు వ్యయంలో 40 శాతం వరకు టెండరింగ్ ప్రక్రియ ప్రారంభించేందుకు ప్రభుత్వం మెట్రో రైల్ కార్పొరేషన్కు ఇప్పటికే సూత్రప్రాయంగా అనుమతులిచ్చింది. డీపీఆర్పై ఆర్థిక మదింపు ప్రక్రియ పూర్తయి కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వెలువడితే తొలి దశ పనులకు పునాది పడనుంది.
Also Read : విమర్శలకు చెక్ పెట్టడంలో విఫలమయ్యారా..?
విజయవాడలో మెట్రో రైల్ ప్రాజెక్టులో భాగంగా సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్.. ఎస్ఐఏ సర్వే ప్రారంభమైంది. బందరు రోడ్డు, ఏలూరు రోడ్డు, గన్నవరం, పెనమలూరులో ఈ ప్రక్రియ చేపడుతున్నారు. రెండు కారిడార్ల మెట్రో రైల్ ప్రాజెక్టుకు దాదాపు 80 ఎకరాలు అవసరం. ఇందులో కోచ్ డిపో, మెట్రో స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా, రెవెన్యూ అధికారుల బృందాలు సంయుక్తంగా సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ సర్వే నిర్వహిస్తున్నాయి. ఇది పూర్తయ్యాక భూసేకరణకు జిల్లా యంత్రాంగం నోటిఫికేషన్ ఇవ్వనుంది.

