గత రెండేళ్ళ నుంచి సంచలనంగా మారిన ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో ఆదాయపు పన్ను శాఖ రంగంలోకి దిగడంతో విచారణ కీలక మలుపు తిరిగింది. హైదరాబాద్లో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులతో ఐటీ శాఖ ఉన్నతాధికారులు అత్యవసర సమావేశం నిర్వహించారు. జాతీయ దర్యాప్తు సంస్థలు ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకోగా మరికొందరిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మరో వైసీపీ కీలక నేతపై ఈడీ దృష్టి పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.
Also Read : రుషికొండ ప్యాలెస్ పరిస్థితి ఏమిటీ సార్..?
ఇక ఈ కుంభకోణానికి సంబంధించి నిందితులు డొల్ల కంపెనీల ద్వారా దుబాయ్తో పాటు పలు విదేశాలకు భారీగా నగదు మళ్లించినట్లు ఐటీ శాఖ జరిపిన ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఈ మనీలాండరింగ్ నెట్వర్క్ను ఛేదించేందుకు నిందితులు, వారికి సహకరించిన డొల్ల కంపెనీల బ్యాంకు ఖాతాల పూర్తి వివరాలను ఐటీ అధికారులు సేకరించారు. ఈ క్రమంలోనే, ఈ స్కామ్లో ప్రధాన నిందితులకు చెందిన దాదాపు రూ. 441 కోట్ల విలువైన స్థిర, చర ఆస్తులను ఈడీ ఇప్పటికే అటాచ్ చేసింది.
Also Read : దిల్ రాజుకు ఇతర భాషలు కలిసి రావడం లేదా..?
ఈ ఆస్తుల అటాచ్మెంట్కు సంబంధించిన పూర్తి పత్రాలను, డిజిటల్ సాక్ష్యాలను ఈడీ అధికారులు ఐటీ శాఖకు అధికారికంగా అందజేశారు. ఇకపై ఈ కేసులో పన్ను ఎగవేత, బినామీ ఆస్తుల కోణంలో ఐటీ శాఖ విడిగా కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేయనుంది. కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, ఐటీలతో పాటు రాష్ట్ర సిట్ అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్తుండటంతో.. రానున్న రోజుల్లో ఈ మద్యం స్కామ్తో సంబంధం ఉన్న మరికొంతమంది కీలక వ్యక్తులకు నోటీసులు జారీ అయ్యే అవకాశం ఉందని రాజకీయ, పారిశ్రామిక వర్గాల్లో చర్చ నడుస్తోంది.

