ప్రియాంక గాంధీ రాజకీయ ఆరంగేట్రానికి ముహుర్తం ఖరారైంది. వయానాడ్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రియాంక సిద్ధమయ్యారు. అచ్చు పోలినట్లు నానమ్మ ఇందిరా గాంధీలా ఉండటంతో ప్రియాంకకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. ఇక పబ్లిక్ను ఆకట్టుకోవడంలో కూడా ప్రియాంక ఆరితేరిపోయారు. అన్న రాహుల్ గాంధీతో కలిసి ఇప్పటికే ఎన్నో రాజకీయ వేదికలపై ప్రసంగించారు. అలాగే పార్టీ గెలుపు కోసం దేశవ్యాప్త పర్యటన చేశారు. తెలంగాణ ఎన్నికల్లో పార్టీ గెలుపు బాధ్యతను ప్రియాంక భుజానికెత్తుకున్నారు కూడా. తెలంగాణలో మహిళా డిక్లరేషన్ సహా పలు కీలక హామీలను ప్రియాంక స్వయంగా చేశారు.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రియాంకను ముఖ్యమంత్రి అభ్యర్థి అంటూ తెగ ప్రచారం కూడా చేశారు. అయితే ఇవన్నీ సోషల్ మీడియా పుకార్లే అని అప్పట్లో తేల్చేశారు. ఇక గత పార్లమెంట్ ఎన్నికల్లో వయనాడ్, రాయ్ బరేలి నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ… రెండు చోట్ల గెలిచారు. అయితే ఉత్తరప్రదేశ్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాయ్ బరేలిని అట్టిపెట్టుకుని వయానడ్ నియోజకవర్గానికి రాజీనామా చేశారు. దీంతో వయనాడ్ నుంచి ఎవరు పోటీ చేస్తారనే అంశం మరోసారి తెరపైకి వచ్చింది. అయితే వయనాడ్ నుంచి ప్రియాంక పోటీ చేస్తారని ఇటీవల జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో తీర్మానం చేశారు.
Also Read : రేవంత్ ఏ పార్టీ…? బీఆర్ఎస్కు కొత్త దిగులు..!
నవంబర్ 13న జరగనున్న ఉప ఎన్నిక కోసం బుధవారం ప్రియాంక నామినేషన్ దాఖలు చేయనున్నారు. నవంబర్ 23 న ఫలితాలు వెలువడనున్నాయి. అయితే వయనాడ్ నుంచి తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్న ప్రియాంక కోసం ఇప్పుడు కాంగ్రెస్ అగ్రనేతలంతా రంగంలోకి దిగనున్నారు. కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు సోనియా గాంధీ వయనాడ్లో ప్రియాంక కోసం ప్రచారం చేయనున్నట్లు తెలుస్తోంది. అనారోగ్య సమస్యల కారణంగా ఈ మధ్యకాలంలో సోనియా గాంధీ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే తొలిసారి తనయ ప్రియాంక పోటీ చేస్తుండటంతో… గెలుపే లక్ష్యంగా సోనియా ప్రచారం చేయనున్నారు. దీంతో వయనాడ్ ఎన్నిక ఆసక్తికరంగా మారింది.