టీటీడీ అధికారులతో పద్మావతి అతిథి గృహంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. తిరుమల పవిత్రత, నమ్మకం కాపాడేలా ఇక్కడ ప్రతి ఒక్కరూ పనిచేయాలని స్పష్టం చేసారు. కొండపై గోవింద నామస్మరణ తప్ప మరో మాట వినిపించకూడదన్నారు. ప్రశాతంతకు ఎక్కడా భంగం కలగకూడదు…ఏ విషయంలోనూ రాజీ పడొద్దు అని హెచ్చరించారు. భవిష్యత్ నీటి అవసరాలకు తగ్గట్లు నీటి లభ్యత ఉండేలా చూసుకోండి…ముందస్తు ప్రణాళిక చాలా అవసరమని స్పష్టం చేసారు.
అటవీ ప్రాంతాన్ని 72 నుంచి 80 శాతంపైగా పెంచాలని అధికారులకు సూచించారు. అటవీ సంరక్షణతో పాటు అడవుల విస్తరణ కోసం వచ్చే 5 ఏళ్లకు ప్రణాళికతో పనిచేయాలని ఆదేశించారు. బయోడైవర్సీటీ పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. టీటీడీ సేవలపై భక్తుల నుంచి స్పందన తీసుకునే విధానంపై కూడా వివరాలు అడిగారు. వచ్చిన ప్రతి భక్తుడు తమ అనుభవాలపై అభిప్రాయాలు చెప్పే అవకాశం కల్పించాలని స్పష్టం చేసారు. భక్తుల సూచనలు, సలహాల ఆధారంగా సేవలపై టీటీడీ పనిచేయాలని ఆదేశించారు.
Read Also : ఫుల్ స్వింగ్ లో షర్మిల.. కారణం ఏంటి?
ఒక్క టీటీడీలోనే కాకుండా అన్ని దేవాలయాల్లో భక్తుల అభిప్రాయాలు తీసుకునే విధానం తీసుకురావాలని మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డికి సిఎం సూచించారు. లడ్డూ ప్రసాదం, అన్న ప్రసాదం నాణ్యత పెరిగింది అని భక్తులు చెపుతున్నారు….ఇది ఎల్లప్పుడూ, పూర్తిగా కొనసాగాలి.. మరింత మెరుగుపడాలి అని ఆదేశించారు. ప్రసాదాల తయారీలో వాడే పదార్థాల నాణ్యత బాగుండేలా చూడండి….అత్యుత్తమ పదార్థాలు మాత్రమే వాడాలన్నారు. తిరుమలలో విఐపీ సంస్కృతి తగ్గాలి… ప్రముఖులు వచ్చినప్పుడు హడావుడి కనిపించకూడదని స్పష్టం చేసారు. సింపుల్ గా, ఆధ్యాత్మిక ఉట్టిపడేలా అలంకరణ ఉండాలి….ఆర్భాటం, అనవసర వ్యయం వద్దని స్పష్టం చేసారు. టీటీడీ సిబ్బంది భక్తుల పట్ల గౌరవంగా వ్యవహరించాలి. దేశ విదేశాలనుంచి వచ్చేవారిని గౌరవించుకోవాలని సూచించారు. దురుసు ప్రవర్తన అనేది ఎక్కడా ఉండకూడదన్నారు చంద్రబాబు.