ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ప్రభుత్వ భూములను కాపాడే ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు సర్కార్… దేవాదాయ శాఖ భూములను రక్షించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. గతంలో అధికారం అడ్డం పెట్టుకుని వైసీపీ నేతలు చేసిన అక్రమాలను ఇప్పుడు బయటపెట్టి చర్యలకు సిద్దమవుతున్నారు. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలకు చెందిన పలువురు కీలక నేతలు భూములను పెద్ద ఎత్తున దోచుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డితో పాటు తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కూడా దోచుకున్నారని తెలుస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాలకు చెందిన 87,167 ఎకరాలు ఆక్రమణదారుల చేతుల్లో ఉన్నాయని ప్రభుత్వం గుర్తించింది. దీనికి సంబంధించి ఇటీవల అన్ని జిల్లాల్లో ఆలయాలు, దేవాదాయ సంస్థల వారీగా భూముల వివరాలను ప్రభుత్వం పరిశీలించింది. ఆలయాలన్నింటికీ కలిపి రికార్డుల ప్రకారం మొత్తం 4.67 లక్షల ఎకరాల భూములున్నట్లు గుర్తించారు. అందులో 87,167 ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి అని అంతర్గత విచారణలో ప్రభుత్వం గుర్తించి ఇప్పుడు చర్యలకు సిద్దమవుతోంది.
గతంలో ప్రభుత్వాలు బస్టాండ్లు, రోడ్లు, పేదలకు ఇళ్ల నిర్మాణం తదితరాలకు 8,196 ఎకరాల మేర దేవాదాయ శాఖ భూములు సేకరించారని ప్రభుత్వ లెక్కల్లో ఉంది. అయితే ఆయా శాఖల నుంచి ఆలయాలకు ఇంకా రూ.991 కోట్లు చెల్లించాల్సి ఉందని గుర్తించారు. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, సీఎం చంద్రబాబు తొలిసారి దేవాదాయ శాఖపై మంగళవారం సమీక్ష నిర్వహిస్తున్నారు. లక్షా అరవై వేల ఎకరాలు వెనుకబడిన వర్గాల వారికి లీజుకి ఇచ్చినట్టుగా ప్రభుత్వం గుర్తించింది. ఇప్పుడు అన్యాక్రాంతం అయిన భూముల మీద దృష్టి పెట్టారు.

