ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు గ్రామాల అభివృద్ధి మీద దృష్టి సారించింది. గ్రామ స్థాయిలో అభివృద్ధి పనుల విషయంలో గత వైసీపీ సర్కార్ పెద్దగా దృష్టి సారించలేదు. గ్రామాలకు కేంద్రం ఇచ్చిన నిధులను కూడా జగన్ సర్కార్ స్వాహా చేసిందనే ఆరోపణలు బలంగా వినిపించాయి. ఇప్పుడు ఇచ్చిన హామీ ప్రకారం గ్రామ సభలు నిర్వహించి గ్రామాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం అడుగులు వేస్తోంది. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామసభలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
13326 గ్రామాల్లో స్వర్ణ గ్రామ పంచాయతీ పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నది ఏపీ ప్రభుత్వం. గ్రామాల్లో సుస్థిర అభివృద్ధికి నాలుగు ప్రణాలికలు సిద్దం చేసింది చంద్రబాబు సర్కార్. దేశ చరిత్రలోనే మొదటిసారిగా ఒకేసారి 13,326 గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి సరికొత్త రికార్డు సృష్టిస్తోంది. గ్రామసభలో మొత్తం నాలుగు అంశాలు… ఒక్కో అంశం కింద నాలుగు కార్యక్రమాలు చేపట్టనున్నారు. రానున్న రోజుల్లో గ్రామ సభ ద్వారా నరేగా నిధుల ద్వారా చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలు ఒకసారి పరిశీలిస్తే…
రెండువేల కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేయనున్నారు. 1000 కిలోమీటర్ల సిమెంట్ కాలువలు నిర్మాణం చేపడతారు. 750 కిలోమీటర్ల తారు రోడ్లు నిర్మిస్తారు. 500 కిలోమీటర్లు మెటల్ రోడ్లు నిర్మించనున్నారు. 60000 సేద్యపు నీటి గుంటలను తవ్వనున్నారు. 25000 ఊట చెరువులును కూడా తవ్వే కార్యక్రమం చేస్తారు. 9 కోట్ల రోజులు కూలీల పనీ దినాలను కల్పిస్తారు. చెప్పిన మాట ప్రకారం గ్రామ సభలు నిర్వహించి గాంధీజీ కలలను సహకారం చేస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేసారు. గత 5 సంవత్సరాలుగా నిర్వీర్యం అయిన గ్రామాల్లో ఇప్పుడు ఇన్ని పనులు జరుగుతున్నాయి అంటే.. రాష్ట్రంలో గ్రామాల దశ తిరిగినట్లే అంటూ సర్పంచులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.