తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. అంకురార్పణతో ఉత్సవాలకు బీజం పడింది. మీనా లగ్నంలో ధ్వజారోహణంతో వాహనసేవలు ప్రారంభం అయ్యాయి. సెప్టెంబర్ 23న శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నాన మహోత్సవంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. బ్రహ్మోత్సవాల సమయంలో సామాన్య భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్కువ ప్రాధాన్యత కల్పిస్తోంది. ఈ తొమ్మిది రోజుల పాటు అన్ని రకాల ప్రత్యేక దర్శనాలు, శ్రీవాణి టిక్కెట్ల జారీని పూర్తిగా నిలిపివేశారు. రోజుకు దాదాపు 80 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సెప్టెంబర్ 14 నుండి సెప్టెంబర్ 20 వరకు భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణు నివాసంలో ఎస్ఎస్డీ టోకెన్ల జారీని తాత్కాలికంగా నిలిపివేశారు. భక్తులు నేరుగా తిరుమలకు వెళ్లి సర్వదర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకోవచ్చు.
Also Read : బ్రేకింగ్: బెజవాడలో హైఅలెర్ట్.. బస్టాండ్ లో భారీగా పేలుడు పదార్ధాలు
ఈ ఏడాది భక్తుల భద్రతను టీటీడీ అధికారులు ప్రధమ ప్రాధాన్యత కింద తీసుకున్నారు. టీటీడీ ఈసారి భద్రత విషయంలో సాంకేతికతకు పెద్దపీట వేస్తోంది. లక్షలాదిగా తరలి వచ్చే భక్తుల రద్దీని సమర్థంగా నియంత్రించడం. అత్యవసర సమయాల్లో కమ్యూనికేషన్కు ఎలాంటి అంతరాయం లేకుండా చూడటం లక్ష్యంగా అధునాతన టెక్నాలజీలను ప్రవేశపెట్టారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. ఏఐ ఆధారిత కెమెరాలు, నెట్వర్క్ సైసింగ్ వంటి టెక్నాలజీలతో భద్రతా వ్యవస్థను మరింత పటిష్ఠం చేస్తోంది.
గరుడ సేవ వంటి ప్రధాన ఘట్టాల సమయంలో మాడ వీధులకు సుమారు 3.5 లక్షల మంది భక్తులు వస్తారని టీటీడీ అంచనా వేస్తోంది. ఇంత భారీ రద్దీ ఉన్నప్పుడు సాధారణ మొబైల్ నెట్వర్క్లు పనిచేయకపోవడం, వాకీటాకీల ఫ్రీక్వెన్సీలు ఓవర్ ల్యాప్ కావడం వంటి సమస్యలు తలెత్తుతాయి. దీనిని అధిగమించేందుకు జియోతో కలిసి ప్రయోగాత్మకంగా ‘నెట్వర్క్ వితిన్ ది నెట్వర్క్’ పేరుతో నెట్వర్క్ స్లైసింగ్ టెక్నాలజీని అమలు చేస్తోంది. దీని కింద 30 అధునాతన కమ్యూనికేషన్ పరికరాలను ఏర్పాటు చేశారు. సాధారణ సిగ్నల్స్ జామ్ అయినా, ఈ పరికరాలు కమాండ్ కంట్రోల్ రూమ్తో అనుసంధానమై పనిచేస్తాయి. 11 కీలక సబ్-కంట్రోల్ పాయింట్ల వద్ద ఉన్నతాధికారులకు వీటిని అందించనున్నారు.
Also Read : చంద్రబాబు అంటే ఇంత భయమెందుకు..?
గ్యాలరీల్లో భక్తుల రద్దీని కచ్చితంగా అంచనా వేసేందుకు ఈసారి తొలిసారిగా ఏఐ, సాఫ్ట్వేర్ ఆధారిత హెడ్ కౌంటింగ్ కెమెరాలను వినియోగిస్తున్నారు. ఇందుకోసం దాదాపు 200 కెమెరాలను ఏర్పాటు చేశారు, గ్యాలరీలను గ్రిడ్లుగా విభజించి, ప్రతి గ్రిడ్లో ఉన్న భక్తుల సంఖ్యను ఈ కెమెరాలు రియల్ టైంలో లెక్కిస్తాయి. ఏదైనా గ్యాలరీ సామర్థ్యానికి మించి నిండిపోతే, వెంటనే అప్రమత్తమై భక్తులను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించేందుకు ఇది దోహదపడుతుంది.
గ్యాలరీల నుంచి భక్తులు ఒకేసారి బయటకు వచ్చే సమయంలో తోపులాటలు జరగకుండా ఈసారి దశల వారీగా కొత్త ఎగ్జిట్ ప్లాన్ అమలు చేస్తున్నారు. ఏ మాడ వీధిలో ఉన్న భక్తులు అదే దిశలో బయటకు వెళ్లేలా మార్గాలను నిర్దేశించారు. దక్షిణ మాడ వీధిలోని భక్తుల కోసం ఎస్-3 గేట్ వద్ద ప్రత్యేక ర్యాంప్ ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి వారు నేరుగా ఆర్టీసీ బస్సుల్లో తిరుపతి లేదా తిరుమల బస్టాండ్లకు చేరుకోవచ్చు. మొత్తం మీద సుమారు 3 వేల సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. అలిపిరి టోల్గేట్, నడక మార్గాల వద్ద ఫేషియల్ రికగ్నిషన్, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాలను అమర్చారు. విజిలెన్స్, పోలీసు సిబ్బంది కలిపి 5,300 మందితో పటిష్ఠ బందోబస్తు నిర్వహిస్తున్నారు. తిరుమలలో 4,600 వాహనాలకు మాత్రమే పార్కింగ్ సౌకర్యం ఉండటంతో ఆ పరిమితి దాటితే తిరుపతిలోని ఏడు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యామ్నాయ పార్కింగ్ స్థలాలకు వాహనాలను మళ్లిస్తారు.

