ఉత్తరాంధ్ర రాజకీయం మారుతోంది. ఉమ్మడి విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) పార్టీని వీడి TDPలో చేరడం కేవలం ఆరంభం మాత్రమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఉత్తరాంధ్రవ్యాప్తంగా వైసీపీ కేడర్, సీనియర్ నాయకుల్లో వ్రమైన అసంతృప్తి గూడుకట్టుకుంది. పార్టీని అంటిపెట్టుకుని ఉంటే భవిష్యత్తు అంధకారమే అవుతుందనే ఆందోళనలో ముఖ్య నేతలు ఉన్నట్లు స్పష్టమవుతోంది.
Also Read : రేవంత్ ప్లాన్.. బీఆర్ఎస్ షాక్..!
2024 ఎన్నికలను పరిశీలిస్తే ఉత్తరాంధ్రలో వైసీపీ పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో అర్థమవుతుంది. గతంలో తిరుగులేని ఆధిక్యం చూపిన ఈ ప్రాంతంలో, 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి సునామీ ముందు ఫ్యాన్ పార్టీ పూర్తిగా కొట్టుకుపోయింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉమ్మడి జిల్లాల పరిధిలోని మొత్తం స్థానాల్లో వైసీపీ నామమాత్రపు సీట్లకే పరిమితమైంది. ప్రజల తీర్పును సైతం సరిగ్గా బేరీజు వేసుకోలేకపోవడంతోనే పార్టీలో ఇప్పుడు ఈ అంతర్మథనం మొదలైంది.
పార్టీలో సీనియర్ నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ సైతం వైసీపీ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారనే వార్తలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. మరోవైపు, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పనులు, మౌలిక వసతుల కల్పన వంటివి వైసీపీ కేడర్ను తీవ్రంగా ఆలోచనలో పడేశాయి. అభివృద్ధికి దూరంగా ఉంటూ కేవలం రాజకీయ విమర్శలకే పరిమితమైతే పార్టీలో ఉనికి కోల్పోతామని ద్వితీయ శ్రేణి నాయకులు భావిస్తున్నారు.
Also Read : ఎన్టీఆర్ భరోసాకు సెలవుల గండం..!
మజ్జి శ్రీను లాంటి కీలక నేత వైసీపీని వీడటం ఉత్తరాంధ్రలో ఆ పార్టీకి తలవంపులు తెస్తోంది. ఇది ఒక శాంపిల్ మాత్రమేనని, రాబోయే కాలంలో మరికొందరు సీనియర్లు, వందలాదిగా కేడర్ పార్టీ వీడేందుకు రెడీగా ఉన్నారని మజ్జి శీనే స్వయంగా చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులు పార్టీని వీడడం వైసీపీకి బిగ్ షాక్ అనే చెప్పుకోవాలి.
మారుతున్న రాజకీయ పరిణామాలు, కుల సమీకరణాలు, ప్రజల నాడిని గుర్తించడంలో వైసీపీ వరుసగా విఫలమవుతుండటంతో.. భవిష్యత్తులో ఆ పార్టీ ఉత్తరాంధ్రలో మళ్లీ పూర్వవైభవం సాధించడం దాదాపు అసాధ్యమేనని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైసీపీ పూర్తిగా ఖాళీ అయ్యే దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి.

