అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడే అంబులెన్స్ సేవలను మరింత వేగవంతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినూత్నమైన ముందడుగు వేసింది. ప్రమాదం జరిగిన వెంటనే అంబులెన్స్ చేరుకునే సమయాన్ని భారీగా తగ్గించడమే లక్ష్యంగా అంబులెన్స్ సేవల్లో అత్యాధునిక ‘క్వాంటమ్ టెక్నాలజీ’ని ప్రవేశపెడుతోంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజా సంక్షేమం, వైద్య రంగాల కోసం ఉపయోగించుకోవడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ వినూత్న పైలట్ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది.
Also Read : బెజవాడ మేయర్ పీఠం కోసం సిగపట్లు..!
ఈ విప్లవాత్మక ప్రాజెక్టు కోసం మొదటగా గుంటూరు జిల్లాను పైలట్ ప్రాంతంగా ఎంపిక చేశారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 67 అత్యవసర అంబులెన్స్లతో ఈ సరికొత్త వ్యవస్థను అమలు చేయనున్నారు. గత మూడేళ్లకు సంబంధించిన ఎమర్జెన్సీ కాల్ డేటాను విశ్లేషించి.. గుంటూరు జిల్లాలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు లేదా అత్యవసర వైద్య పరిస్థితులు ఎక్కడ జరుగుతున్నాయో అంటే హాట్స్పాట్స్ ముందుగానే గుర్తించారు. దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలకు అత్యంత సమీపంలో అంబులెన్స్లను ముందుగానే సిద్ధంగా ఉంచేందుకు వీలు కలుగుతుంది.
Also Read : నెట్టింట వెలిగొండ డామినేషన్.. టాప్ ట్రెండింగ్లో ప్రాజెక్టు ప్రారంభోత్సవం..!
ఈ అల్గారిథమ్ నిర్వహణ కోసం ఏపీ స్టేట్ డేటా సెంటర్లోని ‘Coherent Ising Machine’ అనే అత్యాధునిక క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యవస్థను ఉపయోగించనున్నారు. అత్యంత వేగంగా డేటాను విశ్లేషించి అంబులెన్స్ నెట్వర్క్ను ఆప్టిమైజ్ చేయడంలో ఈ మెషిన్ కీలక పాత్ర పోషిస్తుంది. సమాచారం అందిన వెంటనే నిమిషాల వ్యవధిలోనే అంబులెన్స్ ఘటనా స్థలానికి చేరుకునేలా ఈ సరికొత్త క్వాంటమ్ టెక్నాలజీ తోడ్పడనుంది. వైద్య రంగంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం భవిష్యత్తులో మరెన్నో ప్రాణాలను కాపాడబోతోందని నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

