శ్రీలంక పర్యటనలో భాగంగా కొలంబో వేదికగా జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ ఊహించని విధంగా డ్రాగా ముగియడం ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ రేసులో భారత జట్టుకు గట్టి ఎదురుదెబ్బగా మారింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక 6 వికెట్లు కోల్పోయి కేవలం 229 పరుగులు చేయడంతో భారత్ విజయం దాదాపు ఖాయమనిపించింది. అయితే, ఐదో రోజు లంక బ్యాటర్ సోనాల్ దినుషా అద్భుతమైన పోరాట పటిమను ప్రదర్శించి 133 పరుగులతో నాటౌట్గా నిలిచి భారత బౌలర్లను ముప్పతిప్పలు పెట్టాడు.
Also Read : లివర్ ఆరోగ్యానికి కాఫీ అమృతమా..?
శ్రీలంక 9 వికెట్లకు 429 పరుగులు చేసిన తరుణంలో ఇరు జట్ల కెప్టెన్లు మ్యాచ్ను డ్రాగా ముగించేందుకు అంగీకరించారు. ఈ అనూహ్య డ్రా ఫలితంతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత జట్టు స్థానం మరింత దిగజారింది. ప్రస్తుతం టీమిండియా 11 మ్యాచ్లలో కేవలం 5 విజయాలతో, 51.52 శాతం పీసీటీ మార్కుతో ఐదో స్థానానికి పడిపోయింది. ఈ రేసులో భారత్ కంటే ముందు ఆస్ట్రేలియా (80 శాతం), సౌతాఫ్రికా (75 శాతం), న్యూజిలాండ్ (72.22 శాతం), బంగ్లాదేశ్ (55.56 శాతం) నిలిచాయి.
Also Read : ఆసియా క్రీడల్లో క్రికెటర్లకు ఘోర పరిస్థితులు.. జపాన్పై బీసీసీఐ ఫైర్..!
ఈ టోర్నమెంట్లో భారత్కు ఇక కేవలం 7 టెస్ట్ మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఫైనల్ చేరాలంటే టీమిండియా రాబోయే 7 మ్యాచ్లలో (న్యూజిలాండ్తో 2, ఆస్ట్రేలియాతో 5) కనీసం 5 మ్యాచ్లు ఖచ్చితంగా గెలిచి, ఇతర జట్ల ఓటములపై ఆధారపడాల్సిన క్లిష్ట పరిస్థితి ఏర్పడింది. భారత జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. గెలిచే మ్యాచ్ను డ్రాగా ముగించాల్సి రావడం అత్యంత నిరాశ కలిగించిందని అంగీకరించాడు. “ఐదో రోజు పిచ్ పూర్తిగా నెమ్మదించింది. వికెట్లు తీయడానికి బౌలర్లు శతవిధాలా ప్రయత్నించారు. లంక బ్యాటర్లు కేవలం డిఫెన్స్ కే పరిమితమవ్వడంతో వికెట్లు పడగొట్టడం కష్టమైంది. అయినప్పటికీ మా ఆటగాళ్లు ప్రదర్శించిన పట్టుదల, కష్టానికి నేను పదికి పది మార్కులు ఇస్తాను” అని గిల్ స్పష్టం చేశాడు.

