ప్రపంచవ్యాప్తంగా అమెరికా వీసాల కోసం ఎదురుచూస్తున్న దరఖాస్తుదారులకు డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది. అమెరికా వీసా అపాయింట్మెంట్లను ప్రపంచవ్యాప్తంగా తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. ట్రంప్ తన రెండో విడత అధికారంలోకి వచ్చిన తర్వాత వలస నిబంధనలను కఠినతరం చేసే వ్యూహంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇంటర్వ్యూలు షెడ్యూల్ అయిన అభ్యర్థుల అపాయింట్మెంట్లను రద్దు చేస్తూ వారికి ఈమెయిల్స్ పంపారు. వీరికి తదుపరి తేదీ, సమయాన్ని తర్వాత తెలియజేస్తామని అధికారులు స్పష్టం చేశారు.
Also Read : ఏపీలో వాళ్లకు గుడ్ న్యూస్.. సర్కార్ కీలక నిర్ణయం..!
అన్ని దేశాల్లోని యూఎస్ ఎంబసీలు, కాన్సులేట్లలో అధికారులకు గ్లోబల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ను ప్రారంభించినందువల్లే ఈ నిలిపివేత అని విదేశాంగ శాఖ ప్రతినిధి వెల్లడించారు. భవిష్యత్తులో అమెరికా ప్రభుత్వ నిధులు లేదా ప్రజా ప్రయోజనాలపై ఆధారపడే అవకాశం ఉన్న దరఖాస్తుదారులను గుర్తించి, వారిని ముందే నిలిపివేయడానికి ఈ శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ శిక్షణ ఎంతకాలం కొనసాగుతుందనే పూర్తి వివరాలను ప్రభుత్వం వెల్లడించలేదు. ట్రంప్ తీసుకుంటున్న ఈ తాజా చర్యలతో లీగల్ ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ కూడా మరింత క్లిష్టంగా మారనుంది.
Also Read : మళ్లీ తెరపైకి జమిలీ రచ్చ..!
మరోవైపు, హెచ్-1బీ వీసాల ఫీజును ఏకంగా 1,03,265 డాలర్లు పెంచాలని హోమ్ల్యాండ్ సెక్యూరిటీ విభాగం ప్రతిపాదించింది. దీనివల్ల అమెరికా కంపెనీలు విదేశీ నైపుణ్యం గల ఉద్యోగులను నియమించుకోవడం అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారనుంది. ఈ ప్రతిపాదన అత్యధికంగా హెచ్-1బీ వీసాలు పొందే భారతీయ ఐటీ నిపుణులపై తీవ్ర ప్రభావం చూపనుంది. దీనితో పాటు గత పదేళ్లలో టూరిజం, బిజినెస్ వీసాలపై వచ్చి అక్కడ ఆశ్రయం పొందుతున్న దాదాపు 2 లక్షల మంది వీసాలను రద్దు చేసేందుకు కూడా ట్రంప్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

