కాకినాడ పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం సామూహిక ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతూ తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. నిన్నటివరకు రైఫిల్ షూటింగ్ కోచ్ సాదిక్ ఖాన్ వేధింపుల వల్లే ఈ కుటుంబం అంతా గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకుందని భావించగా.. ఇప్పుడు ఈ కేసులో ఎవరూ ఊహించని బిగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. నూకరాజు వియ్యంకుడు, అంటే మరణించిన జగదీశ్వర్ రెడ్డి తండ్రి అయిన భాస్కర్ రెడ్డి సర్పవరం పోలీస్ స్టేషన్లో సంచలన ఫిర్యాదు చేశారు.
Also Read : నెల్లూరు రూరల్లో ఎమ్మెల్యే సరికొత్త పొలిటికల్ క్యాంపెయిన్..!
తన కొడుకు జగదీశ్వర్ రెడ్డి మరణం వెనుక స్వయంగా కోడలు, నూకరాజు కుమార్తె అయిన సౌజన్య హస్తమే ఉందంటూ ఆయన చేసిన ఆరోపణలు ఇప్పుడు పోలీస్ శాఖను సైతం కుదిపేస్తున్నాయి. పోలీసుల దర్యాప్తులోనూ ఒళ్ళు గగుర్పొడిచే నిజాలు బయటపడుతున్నాయి. గత జూలైలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జగదీశ్వర్ రెడ్డి అనుమానాస్పద స్థితిలో మరణించిన సంగతి తెలిసిందే. అయితే పోలీసుల విచారణలో నిందితుడు సాదిక్ ఖాన్ పక్కా ప్లాన్తోనే జగదీశ్వర్ రెడ్డిని హత్య చేసినట్లు అంగీకరించాడు.
ఇందుకోసం సాదిక్ ఖాన్ ప్రత్యేకంగా హైదరాబాద్ వెళ్లి, అక్కడ ఒక లోకల్ వ్యాపారి దగ్గర అత్యంత ప్రమాదకరమైన ‘సైనేడ్’ కొనుగోలు చేశాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జగదీశ్వర్ రెడ్డికి బలానికి ఉపయోగపడుతుందని నమ్మిస్తూ.. ఆ ప్రొటీన్ పౌడర్ డబ్బాలో సైనేడ్ కలిపి ఇచ్చాడు. అది తెలియక తాగిన జగదీశ్వర్ రెడ్డి కొద్దిసేపటికే ప్రాణాలు విడిచినట్లు సాదిక్ ఖాన్ పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. అయితే, ఇంత పెద్ద విషప్రయోగం ఆసుపత్రి గడిలో జరుగుతుంటే భార్యగా పక్కనే ఉన్న సౌజన్యకు తెలియకుండా ఎలా ఉంటుందని మామ భాస్కర్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు.
Also Read : జోగి నీకు ఓ కూతురు ఉంది.. కోడలు మేఘన సంచలనం..!
భర్తను వదిలించుకోవడానికి సాదిక్ ఖాన్తో కలిసి సౌజన్య లోపాయికారీగా కుట్రలు చేసిందని, తన కొడుకు హత్యకు కోడలే పూర్తిగా సహకరించిందని ఆయన ఆరోపిస్తున్నారు. దీనికి తోడు ఏఈ నూకరాజు, సౌజన్యల సెల్ఫోన్లలోని అనేక కీలకమైన మెసేజ్లు, చాట్స్ డిలీట్ అవ్వడం తీవ్ర అనుమానాలకు తావిస్తోంది. ప్రస్తుతం సాదిక్ ఖాన్కు సైనేడ్ విక్రయించిన హైదరాబాద్ వర్తకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితుడిని పట్టుకోవడానికి కాకినాడ పోలీసులు ప్రత్యేక బృందాలను హైదరాబాద్కు పంపారు. భర్త హత్యలో సౌజన్య కేవలం బాధితురాలా లేక సాదిక్ ఖాన్తో చేతులు కలిపిందా అనే కోణంలో పోలీసులు ముమ్మర దర్యాప్తు జరుపుతున్నారు.

