ఆంధ్రప్రదేశ్లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన పార్టీ శ్రేణులు పూర్తిగా సిద్ధం కావాలని ఆ పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. అమరావతిలో పవన్ కళ్యాణ్ అధ్యక్షతన నిర్వహించిన జనసేన శాసనసభపక్ష సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సుదీర్ఘ కాలంగా పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తల పోరాట పటిమను, వారి ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ బలంగా పోటీ చేయాలని ఈ సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయించారు.
Also Read : కూటమిలో అంతర్గతంగా అసహనం.. నిజమేనా..?
కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన.. రాబోయే ఎన్నికల్లోనూ పొత్తు ధర్మాన్ని పూర్తిగా పాటిస్తూనే ఎన్నికల బరిలోకి వెళ్తుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. సీట్ల సర్దుబాటు, పొత్తుకు సంబంధించిన మిగిలిన రాజకీయ వ్యవహారాలన్నింటినీ తానే స్వయంగా చూసుకుంటానని ఎమ్మెల్యేలు, నేతలకు ఆయన భరోసా ఇచ్చారు. నియోజకవర్గాల్లో పార్టీ బలాబలాలు, క్షేత్రస్థాయి సమీకరణాలపైనే ప్రజాప్రతినిధులు ప్రస్తుతం దృష్టి పెట్టాలని సూచించారు. ఇదే సమయంలో, పొత్తులు లేదా పార్టీ నిర్ణయాలపై ఎవరూ కూడా పార్టీ లైన్ దాటి మాట్లాడొద్దని, క్రమశిక్షణ ఉల్లంఘిస్తే సహించేది లేదని గట్టిగా హెచ్చరించారు.
Also Red : హైదరాబాద్ టార్గెట్గా పాక్ ఐఎస్ఐ భారీ కుట్ర..!
ఎమ్మెల్యేలుగా గెలిచిన ప్రజాప్రతినిధులు నిరంతరం ప్రజల్లో ఉండాలని, ముఖ్యంగా నియోజకవర్గాల్లోని కార్యకర్తల సమస్యలను ఓపికగా విని వాటి పరిష్కారానికి గట్టిగా కృషి చేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు. పార్టీ యంత్రాంగం అంతా ఇప్పటి నుంచే ఎన్నికల మూడ్లోకి వెళ్లాలని, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ శాసనసభపక్ష సమావేశంతో స్థానిక సంస్థల ఎన్నికల వేడి ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా పెరిగింది.

