అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే భారతీయ సామాజిక వర్గాలకు, ముఖ్యంగా ఐటీ నిపుణులకు ట్రంప్ ప్రభుత్వం మరో బిగ్ షాక్ ఇచ్చింది. హెచ్-1బీ, ఎల్-1 వీసాల పొడిగింపు ప్రక్రియపై సరికొత్త అదనపు రుసుములను విధించేందుకు యూఎస్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ విభాగం తుది నిబంధనలను సిద్ధం చేసింది. గతంలో కేవలం కొత్త వీసాల దరఖాస్తులకే పరిమితమైన ఈ ప్రత్యేక రుసుములను, ఇకపై ప్రస్తుతం అమెరికాలో ఉంటూ వీసా రినెవల్స్ కోసం అప్లై చేసుకునే ప్రతి ఒక్కరికీ వర్తింపజేయనున్నారు.
Also Read : టాక్స్ చెల్లింపులో రిషభ్ పంత్ క్రేజీ రికార్డ్..!
ఈ కొత్త ప్రతిపాదన ప్రకారం, 50 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉండి, వారిలో సగానికి పైగా హెచ్-1బీ లేదా ఎల్-1 వీసాదారులు ఉన్న కంపెనీలు ఈ అదనపు భారాన్ని భరించాల్సి ఉంటుంది. దీనివల్ల ప్రతి కొత్త హెచ్-1బీ ఎక్స్టెన్షన్కు 4,000 డాలర్లు అంటే మన కరెన్సీలో సుమారు ₹3.3 లక్షలు, ఎల్-1 ఎక్స్టెన్షన్కు 4,500 డాలర్లు అంటే.. సుమారు ₹3.7 లక్షలు అదనంగా చెల్లించాల్సి వస్తుంది. అమెరికాలోని బయోమెట్రిక్ ఎంట్రీ-ఎగ్జిట్ సిస్టమ్ నిధుల కోసం ఉద్దేశించిన ఈ 9-11 రెస్పాన్స్ ఫీజు వల్ల అమెరికా ప్రభుత్వానికి ఏటా అదనంగా 157.3 మిలియన్ డాలర్ల ఆదాయం సమకూరనుంది.
Also Read : కృష్ణా నదిని మింగేస్తున్నారా..? అమరావతిలో కొత్త కుట్ర..?
అమెరికా వీసా ఎక్స్టెన్షన్లలో సింహభాగం భారతీయులవే కావడంతో ఈ నిర్ణయం మన ఐటీ నిపుణులపై తీవ్ర ప్రభావం చూపనుంది. అధికారిక గణాంకాల ప్రకారం 2025 ఆర్థిక సంవత్సరంలో ఆమోదించబడిన మొత్తం హెచ్-1బీ పొడిగింపుల్లో దాదాపు 77.6% అంటే 2.26 లక్షలకు పైగా భారతీయ నిపుణులవే కావడం గమనార్హం. ఈ కొత్త రూల్ వల్ల అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటా, గూగుల్, యాపిల్ వంటి గ్లోబల్ టెక్ దిగ్గజాలతో పాటు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వంటి భారతీయ ఐటీ సేవల కంపెనీలకు ఉద్యోగులను అంటిపెట్టుకునే ఖర్చులు భారీగా పెరగనున్నాయి.

