ఆంధ్రప్రదేశ్లో వెనుకబడిన తరగతుల సామాజికవర్గాల భద్రత, హక్కుల రక్షణ కోసం కూటమి ప్రభుత్వం చారిత్రాత్మక అడుగు వేస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన కీలక హామీని నెరవేర్చే దిశగా ప్రతిష్టాత్మక బీసీ రక్షణ చట్టం ముసాయిదా బిల్లుకు రాష్ట్ర న్యాయశాఖ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చట్టబద్ధంగా, రాజ్యాంగ సూత్రాలకు లోబడి రూపొందించిన ఈ ముసాయిదాను మరింత పటిష్టం చేసేందుకు నేడు అమరావతిలో ఉన్నత స్థాయి కీలక సమావేశం జరగనుంది.
Also Read : వైసీపీ లో బోరుగడ్డ తిరుగుబాటు..కారణం అదేనా..?
ఈ భేటీలో రాష్ట్రానికి చెందిన బీసీ సామాజికవర్గ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు మంత్రివర్గ ఉపసంఘం పాల్గొని విస్తృతంగా చర్చించనున్నారు. ఈ నూతన చట్టాన్ని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం తరహాలోనే అత్యంత పటిష్టమైన సెక్షన్లతో తీసుకువస్తున్నారు. సమాజంలో బీసీలను కులాలు, సాంప్రదాయ వృత్తుల పేరుతో దూషించినా, సామాజికంగా లేదా ఆర్థికంగా బహిష్కరణలకు గురిచేసినా కఠిన చర్యలు తీసుకునేలా ఇందులో నిబంధనలు చేర్చారు.
Also Read : నవంబర్ వరకు నో ఎలక్షన్స్.. ఫుల్ క్లారిటీ..!
ముఖ్యంగా బీసీ కమ్యూనిటీలపై జరిగే దాడులు, దౌర్జన్యాలు, వేధింపులను అరికట్టడానికి దాదాపు 15 రకాల నిర్దిష్ట నేరాలను గుర్తించి, వాటికి కఠినమైన శిక్షలు విధించేలా ఈ చట్ట పరిధిని విస్తరించారు. బీసీల ధన, మాన, ప్రాణాలకు పూర్తి భరోసా కల్పించి, సమాజంలో వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడమే ఈ బిల్లు ప్రధాన లక్ష్యం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి జాబితా పరిధిలోకి వచ్చే ఈ నేర విచారణ చట్టాన్ని రాష్ట్ర శాసనసభలోనే తీర్మానించేలా అధికారులు కసరత్తు పూర్తి చేశారు. నేటి సమావేశంలో ప్రజాప్రతినిధుల నుంచి వచ్చే తుది సూచనలతో పాటు, త్వరలోనే బీసీ కార్పొరేషన్ చైర్మన్లు, వివిధ బీసీ సంఘాల ప్రతినిధుల అభిప్రాయాలను కూడా సేకరించనున్నారు. అందరి సలహాల ఆధారంగా తుది ముసాయిదాను సిద్ధం చేసి, త్వరలోనే ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు. ఆ తర్వాత దీనిని జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ మరియు కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం పంపించనున్నారు.

