ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులు చేపట్టిన నిరసన ప్రదర్శన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. జూలై 20న జరిగిన ఈ ఆందోళనలను అదుపు చేసే క్రమంలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది నిరసనకారులపై వివాదాస్పద పెల్లెట్ గన్లను ఉపయోగించడం ఇప్పుడు అంతర్జాతీయంగా మానవ హక్కుల చర్చకు వేదికైంది. స్థానిక డీసీపీ ఆదేశాల మేరకు భద్రతా దళాలు ఏకంగా 55 నాన్-ఎలక్ట్రిక్ షెల్స్, 15 ఎలక్ట్రిక్ షెల్స్, 5 టియర్ గ్యాస్ గ్రెనేడ్లతో పాటు యాంటీ రైట్ గన్ల అంటే పెల్లెట్ గన్స్ ద్వారా రెండు రౌండ్ల కాల్పులు జరపడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
Also Read : జగన్ ట్రాప్ లో టీడీపీ నేతలు.. టీడీపీ ఎమ్మెల్యే సంచలన కామెంట్స్
సాధారణంగా ఒకే ఒక బుల్లెట్ ను కాకుండా, ఒకేసారి వందలాది చిన్న చిన్న లోహపు గుళికలను విరజిమ్మే ఈ పెల్లెట్ గన్ల వాడకం అత్యంత ప్రమాదకరమైనదిగా పరిగణించబడుతుంది. ఇవి శరీరంలోకి దూసుకెళ్తే చర్మాన్ని, కండరాలను తీవ్రంగా గాయపరచడమే కాకుండా, కంటికి తగిలితే శాశ్వత అంధత్వానికి దారితీస్తాయి. జంతర్ మంతర్ వద్ద జరిగిన ఈ కాల్పుల కారణంగా ఎయిమ్స్ ట్రామా సెంటర్లో చికిత్స పొందుతున్న 19 ఏళ్ల సచిన్ లోచాబ్ అనే విద్యార్థి తన కుడి కంటి చూపును శాశ్వతంగా కోల్పోయే ప్రమాదంలో పడ్డాడు.
Also Read : ఇక రాష్ట్రాల వైపు ఫోకస్.. ప్రక్షాళన దిశగా అడుగులు..!
గతంలో జమ్మూ కాశ్మీర్లో అల్లర్లను అణచడానికి వాడిన ఈ ఆయుధాలను శాంతియుత పౌర నిరసనలను అణచడానికి ఉపయోగించకూడదని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నప్పటికీ భద్రతా దళాలు వీటిని ప్రయోగించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ ఘటనపై రాజకీయంగా కూడా పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. పరీక్షల అవినీతిపై న్యాయం కావాలని శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై ఇలాంటి ప్రాణాంతక ఆయుధాలను ప్రయోగించి వారి చేతులు, కాళ్లు, పక్కటెముకలు విరగ్గొట్టడం అమానుషమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండించారు.

