కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు హాజరవడంపై తనపై వస్తున్న విమర్శలపై జగ్గంపేట టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తీవ్రంగా స్పందించారు. ఇటీవల గుంటూరులో జరిగిన ముద్రగడ సంతాప సభకు హాజరైన విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, ఆ వేదికపై చేసిన వ్యాఖ్యలు, తదనంతరం జ్యోతుల నెహ్రూ, వంగవీటి రాధాలను ఉద్దేశించి చేసిన కామెంట్స్ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో జ్యోతుల నెహ్రూ కూటమి నేతలకు కీలక సూచనలు చేస్తూ బొండా ఉమ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు.
Also Read : మేమూ బాధితులమే.. తమ్మినేని కొత్త డ్రామా..!
తాను ఎవరినో బ్లాక్ మెయిల్ చేయడం కోసమో లేదా రాజకీయ ప్రయోజనాల కోసమో ముద్రగడ సంస్మరణ సభకు వెళ్లలేదని జ్యోతుల నెహ్రూ స్పష్టం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ వేస్తున్న రాజకీయ వ్యూహాలు, ట్రాప్ లలో తమ కూటమి నేతలే చిక్కుకుంటున్నారని, ఇది సరైన పద్ధతి కాదని ఆయన హితవు పలికారు. ప్రతిపక్షాల ట్రాప్లో పడకుండా కూటమి నేతలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారాన్ని కోల్పోవడానికి కాపు ఉద్యమమే ప్రధాన కారణమంటూ బొండా ఉమ చేసిన వ్యాఖ్యలపై జ్యోతుల నెహ్రూ అసంతృప్తి వ్యక్తం చేశారు.
Also Read : రంగనాథ్ను తొలగిస్తారా.. లేక కొనసాగిస్తారా..?
ఒక ఎన్నికల ఓటమికి లేదా గెలుపునకు కేవలం ఒక్క అంశాన్ని మాత్రమే కారణంగా చూపించడం సమంజసం కాదని ఆయన కొట్టిపారేశారు. కాపు సామాజిక వర్గం ఎప్పుడూ రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షించే ప్రభుత్వాల వెంటే నడుస్తుందని స్పష్టం చేశారు. మెజారిటీ కాపు సామాజిక వర్గం ఏ వైపు మొగ్గు చూపితే ఆ ప్రభుత్వాలే అధికారంలోకి వస్తాయని జ్యోతుల నెహ్రూ విశ్లేషించారు. కాపుల సామాజిక, ఆర్థిక వికాసానికి, వారి అభివృద్ధికి సరైన నిర్ణయాలు తీసుకోగల సత్తా కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి మాత్రమే ఉందని ఆయన స్పష్టం చేశారు. అనవసర వివాదాలకు తావివ్వకుండా, కూటమి లక్ష్యాలకు అనుగుణంగా నేతలంతా కలిసికట్టుగా సాగాలని ఆయన పిలుపునిచ్చారు.

