ఒడిశా మట్టి నుంచి ఢిల్లీ పీఠం దాకా.. మోదీ క్యాబినెట్లో తిరుగులేని నమ్మకస్థుడిగా.. ఒడిసాలో సాధ్యం కాదనుకున్న అధికారాన్ని సుసాధ్యం చేసిన వ్యూహకర్తగా.. ఇలా ఢిల్లీ వేదికగా.. చక్రం తిప్పిన ధర్మేంద్ర ప్రధాన్ సామ్రాజ్యం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. నీట్ పేపర్ లీక్ పాపంలో చివరకు విద్యార్థి లోకం ఆగ్రహానికి ఆయన బలికాక తప్పలేదు. చిత్రం ఏంటంటే.. 1983లో కాలేజీ రోజుల్లో ఏబీవీపీ కార్యకర్తగా, విద్యార్థి నేతగా ఎదిగిన ఆయనే.. ఈరోజు అదే విద్యార్థుల కాక్రోచ్ ఉద్యమ తీవ్రతకు భయపడి డెడ్ లైన్ లోపే మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
Also Read : అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరుగుతుందా..?
ధర్మేంద్ర ప్రధాన్ జూన్ 26, 1969న ఒడిశాలోని తాల్చేర్ ల జన్మించారు. ఆయన తండ్రి మాజీ కేంద్ర మంత్రి దేవేంద్ర ప్రధాన్ కావడం గమనార్హం. ఉత్కల్ యూనివర్సిటీ నుండి ఆంత్రోపాలజీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన ఆయన రాజకీయ ప్రస్థానం 1983లో కాలేజీ రోజుల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తగా ప్రారంభమైంది. ఆ తర్వాత రాజకీయాల్లో ధర్మేంద్ర ప్రధాన్ గ్రాఫ్ ఎప్పుడూ పైకే సాగింది. ఒడిశా అసెంబ్లీలో బెస్ట్ ఎమ్మెల్యేగా అవార్డు అందుకోవడం నుంచి, మోదీ సర్కార్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఉజ్వల యోజన అంటే గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకాన్ని సక్సెస్ చేసి ప్రధాని గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు.
Also Read : ఎన్టీఆర్ బాటలోనే చంద్రబాబు.. మరో సంస్కరణ..!
అందుకే ఆయనకు క్రేజీ పదవులు అయిన పెట్రోలియం, స్టీల్, ఆ తర్వాత ఏకంగా దేశ విద్యాశాఖ పగ్గాలను అప్పగించారు మోదీ. 2024 ఎన్నికల్లో గెలిచాక కూడా మళ్లీ ఆయన్నే విద్యాశాఖా మంత్రిని చేశారంటే ఢిల్లీలో ఆయన పవర్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. 2000 నుండి 2004 వరకు ఒడిశా ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో ఆయనకు ఉత్తమ శాసనసభ్యుడిగా అవార్డు లభించింది. ఆ తర్వాత 2004 లో తొలిసారిగా లోక్సభకు ఎన్నికై, అదే ఏడాది బీజేపీ యువజన విభాగం జాతీయ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2012 నుండి 2018 వరకు రాజ్యసభ ఎంపీగా ఉంటూ పార్లమెంటరీ కమిటీలలో చురుగ్గా వ్యవహరించిన ఆయన, జూన్ 2024లో 18వ లోక్సభ కు ఎన్నికయ్యారు. అయితే, నీట్ పరీక్షల పేపర్ లీకేజీలు, అక్రమాలపై దేశవ్యాప్తంగా చెలరేగిన తీవ్ర నిరసనల కారణంగా శనివారం ఆయన తన కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా సమర్పించారు. విద్యార్ధి నేతగా ఎదిగి.. విద్యార్ధుల దెబ్బకే రాజీనామా చేయడం మాత్రం సంచలనమే.

