గుంటూరులో మహిళపై జరిగిన అమానవీయ ఘటనను వైకాపా నేత అంబటి రాంబాబు తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం అత్యంత దుర్మార్గమని ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న తనపై బురదజల్లడం సరికాదన్నారు. అంబటి రాంబాబు సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియో పూర్తిగా కల్పిత కథనమని, అందులో ఎలాంటి నిజం లేదని కొట్టిపారేశారు. ఈ క్రమంలోనే తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా ఆరోపణలు చేసినందుకు ఆయనపై కోర్టులో పరువు నష్టం దావా వేస్తున్నట్లు స్పష్టం చేశారు.
Also Read : అమర్ రాజాకు ఏపీ గవర్నమెంట్ బిగ్ గిఫ్ట్..!
బాధితురాలికి అన్యాయం జరిగితే తాము వెనకేసుకొస్తున్నామంటూ అంబటి చేస్తున్న ఆరోపణలను ఎమ్మెల్యే తీవ్రంగా ఖండించారు. కృష్ణబాబు కాలనీలో మహిళపై దాడి జరిగిన విషయం తన దృష్టికి వచ్చిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్పందించామని తెలిపారు. స్వయంగా తానే పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి నిందితులను వెంటనే అదుపులోకి తీసుకోవాలని ఆదేశించామన్నారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న స్థానిక టీడీపీ నాయకుడు మల్లెల మూర్తిపై పార్టీ పరంగా కూడా కఠిన చర్యలు తీసుకున్నామని, అతడిని పార్టీ నుండి సస్పెండ్ చేశామని గుర్తు చేశారు.
Also Read : తమ్మినేని చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..!
తప్పు ఎవరు చేసినా తప్పేనని, నిందితుడు సొంత పార్టీ వాడైనా సరే చట్టం ముందు సమానుడేనని ఎమ్మెల్యే గళ్ళా మాధవి స్పష్టం చేశారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికలను మనసులో పెట్టుకుని తప్పు చేసిన వారిని కాపాడే సంస్కృతి తెలుగుదేశం పార్టీకి లేదన్నారు. ఎన్డీయే ప్రభుత్వంలో మహిళల రక్షణ, భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఉంటుందని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని మహిళలను వేధించే వారిపై ఎలాంటి రాజీ లేకుండా కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. గతంలో కూడా విద్యార్థినులను, మహిళలను ఇబ్బంది పెట్టిన గంజాయి ముఠాలపై ఉక్కుపాదం మోపామని, ఈ కేసులోనూ బాధితురాలికి పూర్తి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.

