ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు భూముల రికార్డులు, పట్టాదారు పాస్బుక్లకు అంశం తీవ్ర రాజకీయ చర్చకు దారితీసింది. వైసీపీ ప్రభుత్వం పట్టాదారు పాస్బుక్లు, సరిహద్దు రాళ్లపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫోటోలను ముద్రించడం, అలాగే ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని తీసుకురావడం ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలకు కారణమయ్యాయి. ఈ నిర్ణయాలు రైతుల్లో భూమి హక్కులపై అనుమానాలు పెంచాయని ప్రతిపక్షాలు ఆరోపించాయి.
Also Read : అవి అక్రమ కేసులే.. ఆధారాల్లేవ్.. చంద్రబాబుకి సుప్రీం క్లీన్ చిట్..!
2024 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం – జనసేన – బీజేపీ కూటమి భూ హక్కుల పరిరక్షణను ప్రధాన ఎన్నికల హామీల్లో ఒకటిగా ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ఫోటోల స్థానంలో ప్రభుత్వ అధికారిక రాజముద్రతో కొత్త పట్టాదారు పాస్బుక్కులు జారీ చేస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 73 లక్షల కొత్త పట్టాదారు పాస్బుకులను ముద్రించి పంపిణీ ప్రక్రియను ప్రారంభించింది. కొత్త పాస్బుకులపై వ్యక్తిగత ఫోటోల స్థానంలో అధికారిక ప్రభుత్వ రాజముద్ర ముద్రించడం ద్వారా ప్రభుత్వ పత్రాల గౌరవాన్ని పునరుద్ధరించే ప్రయత్నం చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది.
Also Read : గల్లా జయదేవ్ కు లోకేష్ క్షమాపణ.. అసలేం జరిగింది..?
కొత్త పాస్బుకుల్లో నాణ్యమైన కాగితం, ఆధునిక భద్రతా ప్రమాణాలు, క్యూఆర్ కోడ్ వంటి సాంకేతిక అంశాలను పొందుపరిచారు. క్యూఆర్ కోడ్ ద్వారా రైతులు తమ భూమి వివరాలను సులభంగా ధ్రువీకరించుకునే అవకాశం కల్పించారు. దీంతో పాస్బుక్కుల విశ్వసనీయతతో పాటు వినియోగ సౌలభ్యం కూడా పెరిగిందని అధికారులు పేర్కొంటున్నారు. కొత్త పాస్బుక్ల పంపిణీకి గ్రామీణ ప్రాంతాల్లో మంచి స్పందన లభిస్తున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో భూముల అంశంపై నెలకొన్న వివాదాల నేపథ్యంలో ఇప్పుడు అధికారిక రాజముద్రతో పాస్బుకులు అందడంతో రైతుల్లో విశ్వాసం పెరిగిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read : పోలవరం-బనకచర్ల వివాదం.. తెలంగాణ పిటిషన్పై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..!
రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, భూముల అంశం గత ఎన్నికల్లో కీలక పాత్ర పోషించింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి చంద్రబాబు రైతులకు వివరించారు. బహిరంగ సభలో నాడు జగన్ సర్కార్ ఇచ్చిన పాస్బుక్కులను చింపేశారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే యాక్ట్ రద్దు చేస్తామన్నారు. ఇప్పుడు వివాదాస్పదంగా మారిన విధానాలను సవరించి కొత్త పాస్బుకులను పంపిణీ చేయడం ద్వారా కూటమి ప్రభుత్వం రైతాంగానికి సానుకూల సందేశం పంపినట్లయిందని విశ్లేషిస్తున్నారు.
ప్రభుత్వ వ్యవస్థల్లో వ్యక్తిగత ప్రచారానికి బదులుగా అధికారిక గుర్తింపునకు ప్రాధాన్యం ఇచ్చామనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కూటమి ప్రభుత్వం విజయవంతమైందనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. 73 లక్షల మంది రైతుల చేతుల్లోకి చేరుతున్న ఈ కొత్త పట్టాదారు పాస్బుకులు పరిపాలనా పరంగా మాత్రమే కాకుండా రాజకీయంగానూ కూటమికి ప్రయోజనం చేకూర్చే అంశంగా మారే అవకాశముందని పరిశీలకులు భావిస్తున్నారు.

