ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఇటీవల ప్రకటించిన సరికొత్త యూజర్ నేమ్ ఫీచర్పై కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ఫీచర్ వల్ల ఆన్లైన్ మోసాలు, భద్రతాపరమైన ముప్పు పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వం వాట్సాప్ మాతృసంస్థ మెటాకు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వంతో సంప్రదింపులు పూర్తియి, పూర్తి సంతృప్తికరమైన వివరణ ఇచ్చేంతవరకు ఈ ఫీచర్ ను రోల్ అవుట్ చేయవద్దని కేంద్రం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీనిపై మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని గడువు విధించింది.
Also Read : స్కూల్స్ లో ఎలక్షన్స్.. విజయ్ సంచలన నిర్ణయం..!
వినియోగదారులు తమ ఫోన్ నంబర్లను ఇతరులతో పంచుకోకుండా, కేవలం ఒక ప్రత్యేకమైన యూజర్ నేమ్ ద్వారా మాత్రమే చాట్ చేసుకునే వీలు కల్పించే సరికొత్త ప్రైవసీ ఫీచర్ ను వాట్సాప్ సోమవారం ప్రకటించింది. అయితే, ఈ ఫీచర్ వల్ల సైబర్ నేరగాళ్లకు మరింత సులువవుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఫోన్ నంబర్ లేకపోవడం వల్ల ఆన్లైన్ మోసాలు, ఫిషింగ్, డిజిటల్ అరెస్ట్ స్కామ్ లు, ఇతరుల పేర్లతో నకిలీ ఐడీలు సృష్టించే ముప్పు గణనీయంగా పెరుగుతుందని నోటీసులో పేర్కొంది.
Also Read : రంగంలోకి రేవంత్ టీమ్.. రెడీ..!
ప్రముఖ వ్యక్తులు, ప్రభుత్వ సంస్థలు, బ్యాంకులు లేదా ప్రభుత్వ అధికారుల పేర్లను పోలిన యూజర్ నేమ్స్ ను సృష్టించి ప్రజలను మోసం చేసే ప్రమాదం ఉందని ప్రభుత్వం హెచ్చరించింది. సమాచార సాంకేతిక చట్టం, ఐటీ రూల్స్ 2021 నిబంధనల ప్రకారం ఒక బాధ్యతాయుతమైన సోషల్ మీడియా వేదికగా వాట్సాప్ వ్యవహరించాల్సి ఉంటుందని, నిబంధనలు ఉల్లంఘిస్తే ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలని కేంద్రం ప్రశ్నించింది. దీనిపై వాట్సాప్ స్పందిస్తూ.. తాము ఈ ఫీచర్లో తగిన రక్షణ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.
ప్రముఖులు, ప్రభుత్వ సంస్థలు, వెరిఫైడ్ ఖాతాల పేర్లను ఇతరులు దక్కించుకోకుండా ముందే రిజర్వ్ చేసి ఉంచామని, పైగా కొత్తగా ఎవరైనా మెసేజ్ పంపితే వారి లొకేషన్, అకౌంట్ వయస్సు వంటి వివరాలను యూజర్లకు చూపిస్తామని, కాబట్టి భయపడాల్సిన అవసరం లేదని వాట్సాప్ ప్రతినిధి వివరణ ఇచ్చారు. అయినప్పటికీ, ప్రభుత్వంతో త్వరలోనే జరిగే ఉన్నత స్థాయి సమావేశంలో దీనిపై తుది నిర్ణయం వెలువడనుంది.

