అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీతో పాటు ఇతరులపై నమోదైన క్రిమినల్ కేసును తక్షణమే కొట్టివేయడానికి అమెరికా ఫెడరల్ కోర్టు నిరాకరించింది. ఈ మేరకు బ్రూక్లిన్ సమాఖ్య న్యాయస్థానానికి చెందిన యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి నికోలస్ గరాఫిస్ ఒక కీలకమైన ఆదేశాలు జారీ చేశారు. అదానీపై ఉన్న అభియోగాలను వెనక్కి తీసుకోవాలని భావిస్తున్న అమెరికా న్యాయశాఖ నిర్ణయాన్ని కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. భారత్ లోని సోలార్ విద్యుత్ కాంట్రాక్టులను దక్కించుకోవడానికి ప్రభుత్వ అధికారులకు సుమారు 250 మిలియన్ డాలర్ల లంచం ఇచ్చారనే ఆరోపణలపై 2024లో ఈ క్రిమినల్ కేసు నమోదైంది.
Also Read : వైసీపీలో చేరబోతున్న టీడీపీ ఎమ్మెల్యే..!
అయితే, గత నెలలో అమెరికా న్యాయశాఖ ఈ కేసుపై మరిన్ని వనరులను కేటాయించలేమని పేర్కొంటూ, కేసును ఉపసంహరించుకోవడానికి సిద్ధపడింది. ఈ నేపథ్యంలోనే అదానీ తరపు న్యాయవాదులు కోర్టును ఆశ్రయించి కేసును పూర్తిగా కొట్టివేయాలని కోరారు. అదానీ లాయర్ల అభ్యర్థనను తోసిపుచ్చిన న్యాయమూర్తి, కేసును ఎందుకు వెనక్కి తీసుకోవాలని అనుకుంటున్నారో దానికి గల స్పష్టమైన కారణాలను వివరించాలని న్యాయశాఖను ఆదేశించారు. ప్రభుత్వ ప్రతిపాదన చాలా క్లుప్తంగా, అస్పష్టంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : ఏపీ మ్యాప్ తో మార్కెట్లోకి జొన్నగిరి గోల్డ్..!
ఈ ఉపసంహరణకు గల ప్రతి కారణాన్ని తగిన ఆధారాలతో సహా జులై 13, 2026 లోగా కోర్టుకు సమర్పించాలని గడువు విధించారు. అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ తో సివిల్ కేసులో అదానీ 6 మిలియన్ డాలర్లు, సాగర్ అదానీ 12 మిలియన్ డాలర్ల జరిమానా చెల్లించడానికి ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ, ఈ క్రిమినల్ కేసు మాత్రం కోర్టు తుది నిర్ణయం వచ్చే వరకు అధికారికంగా కొనసాగుతూనే ఉంటుంది. కోర్టు విధించిన జులై 13 గడువులోగా అమెరికా న్యాయశాఖ సమర్పించే వివరణ ఆధారంగానే అదానీ భవితవ్యం తేలనుంది.

